నెట్లో హల్ చల్ చేస్తున్న బాహుబలి 2 స్టోరీ!

  • April 13, 2017 / 02:38 PM IST

బాహుబలి కంక్లూజన్ కథ అంటూ ఇదివరకు అనేక కథలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ సినిమా ఈనెల 28 న రిలీజ్ కాబోతుండగా.. అభిమానుల ఆత్రుత మరింత పెరిగింది. బాహుబలి 2 స్టోరీ లీకైందంటూ ఈ కథ బయటికి వచ్చింది. అందరూ ఇదేనని నమ్ముతున్నారు. ఆ స్టోరేలీకి మనం వెళ్దాము..

గిరిజన రాజు కూతురు దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె మాహిష్మతి రాజ్యానికి రావటానికి నిరాకరిస్తుంది. దీంతో ఆమెతోనే ఉండిపోతాడు బాహుబలి. దేవసేనతోనే ఉండమంటూ బాహుబలిని ప్రోత్సహించి, రాజమాతకు మాత్రం బాహుబలిపై లేనిపోనివి చెబుతుంటాడు. ఇలా రాజ్యపెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడినుంచీ బాహుబలిని నిర్మూలించటానికి ప్రణాళికలు వేస్తాడు.

తన మనుషులతోనే అరాచకాలు చేయించి, అవన్నీ ఆటవికసైన్యం చేస్తోందనీ, వారికి బాహుబలి మద్దతు ఉందనీ చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈ లోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టటం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయనీ, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారనీ చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో బయలు దేరుతాడు.

కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాలదేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురువెళతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాలదేవుడి దుష్ట అనుచరులు ఒక వైపు, బాహుబలిని అభిమానించే సైన్యం మరో వైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి, లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు.

భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. రాజమాత పశ్చాత్తాప పడుతుంది.

ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రీ అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కిందివరకూ వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు.

అతడు దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. మహేంద్ర బాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.?, మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.?దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా. ఇదే విజయేంద్ర ప్రసాద్ కాగితం పై రాజమౌళి వెండితెరపై రాసిన బాహుబలి కంక్లూజన్ స్టోరీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus