తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ (Babu Mohan) గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. సుమారు 2000 చిత్రాలలో నటించి ఆయనకు ఉన్న సామాజిక స్పృహతో రాజకీయాలలో అడుగు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో సేవలు అందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, శ్రీ నాగ బాల సురేష్, హీరో రాంకీ, నటుడు 30 ఇయర్స్ పృథ్వి రాజ్, సినీ జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగ బాల సురేష్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేడు మన అందరి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, గొప్ప గుణం గల బాబు మోహన్ గారు ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టీ 41 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2000కు పైగా సినిమాలలో నటించిన ఆయనకు రేలంగి అవార్డు రావడం చాలా సంతోషించదగిన విషయం. ఆయన నటనా రంగంలో, రాజకీయ రంగంలో ఇప్పటికీ ఎన్నో చూసేసారు. ఆయన మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ… “నాకు ధర్మయుద్ధం చిత్ర సమయంలో పరిచయం అయిన బాబు మోహన్ గారు ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగినా, మంత్రిగా పని చేసినా అదే సామాన్య వ్యక్తిత్వంతో ఉన్న వ్యతి. సాధారణంగా రామారావు గారితో కలిసి నటించడమే ఎంతో మందికి కలగా ఉండేది కాని ఆయతో కలిసి కేబినెట్ లో మంత్రిగా లంచాన్ని అరిగట్టే విధంగా పని చేసే అదృష్టం ఆయనకే కలిగింది. కేలవం సేవ మాత్రమే చేసే గొప్ప వ్యక్తిత్వంతో ఆయన రాజకీయాలలో మంచి సేవ చేశారు. మానసిక పరిస్థితుల వల్ల కడిసిపోయిన వారు ఒక డాక్టర్ లా ఆయన హాస్యాన్ని చూసేవారు. అంతటి గొప్ప వ్యక్తి మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో రాంకీ గారు మాట్లాడుతూ… “రేలంగి గారు అంటే చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరిట అవార్డులు తగ్గ అర్హత ఉన్న వారికే వస్తాయి. అలా రేలంగి అవార్డు మన బాబు మోహన్ గారికి రావడం చాలా సంతోషంగా ఉంది. 2000 పైగా సినిమాలలో నటించినా ఆయనకు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రముఖ జర్నలిస్టు సురేష్ కొండేటి మాట్లాడుతూ… “నా సినీ జర్నలిస్టుగా ప్రయాణం మొదలైన తొలి దశ నుండి బాబు మోహన్ గారిని చూస్తున్నాను. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. జర్నలిస్టులను దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎన్ని అవార్డులు రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు 30 ఇయర్స్ పృథ్వి రాజ్ గారు మాట్లాడుతూ… “నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మా బాబు మోహన్ గారికి రేలంగి అవార్డు వచ్చిందని చాలా సంతోషించాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, బ్రహ్మానందం అనే వ్యక్తులు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం వంటి మంచి త్రయం. రేలంగి గారు మా ఊరు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన గొప్పతనం నాకు బాగా తెలుసు. కార్మిక శాఖ మంత్రిగా రామారావు గారి పాలనలో ఆయన మంత్రిత్వానికి వన్నె తెచ్చే విధంగా సేవలు అందించారు. ఆయనతో కలిసి నటించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆరోజుల్లో ఆరోగ్యకరమైన మంచి హాస్యాన్ని బాబు మోహన్ గారు పండించారు. అటువంటి హాస్యం మరోసారి తిరిగి రావాలంటే బాబు మోహన్ గారిని ఫాలో అవ్వాలి” అన్నారు.
బాబు మోహన్ గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య వ్యక్తులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ప్రజాస్వామ్యం పుట్టిన తరువాత లేబర్ యాజమాన్య మంత్రిగా చాలా అరుదుగా చేశారు. అటువంటి మంత్రిగా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను మొత్తం ఆ వ్యవస్థ అంతా కాపాడుకోవాలి, చాలా కఠినంగా పని చేసేవాడిని. అప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేయడం వల్ల నాకు సులభం అయిపోయేది. నాకు ఎందుకో తొలిసారి ఛాంబర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి అనిపించింది. నాటి మాయాబజార్ చిత్రంలో రేలంగి గారి పాత్ర వేయడం చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఆ చిత్రాలలో నా పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి. నా తొలి చిత్రాలలో నా నటన చూసి అందరూ నన్ను మరింత ప్రోత్సహించారు. నాకు వివిధ చిత్రాలలో వివిధ పాత్రలు ఇచ్చి, నన్ను నా దర్శకులు మంచి నటుడుని చేశారు. ఎంతో మందికి సేవలు చేశాను, చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను. రాజకీయాలకు దూరం అయిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి, సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాను. ఇలా చేస్తున్నందుకు, మీ అందరితో కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా రేలంగి గారి ఇంటి వద్ద బాణసంచారాలు పేలాయి అనే విషయం తెలిసిన సంతోషం. నాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి, అంతకంటే ప్రజల ఆశీస్సులే నాకు గొప్ప దీవెనగా తీసుకుంటాను. ఇక పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు” అన్నారు.
అయితే 2000 చిత్రాలకు పైగా నటించిన వ్యక్తికి మన తెలుగు రాష్ట్రాల తరపున పద్మశ్రీ అవార్డు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తూ రానున్న అవార్డు సమయంలో ప్రభుత్వాలు, సంస్థలు డిమాండ్ చేయవలసిందిగా మనం కోరుకుందాం అంటూ ప్రముఖులు ముగించారు.