మణిరత్నం సినిమా పండక్కి వచ్చేస్తుందా..?

  • November 5, 2016 / 07:32 AM IST

2004 తర్వాత మణిరత్నం సినిమాలు నెమ్మదించాయన్నది తెలిసిందే. అక్కడినుండి ఆయన సినిమా అంటే మూడేళ్ళ మాటని అనుకోవడం మొదలెట్టారు. విజయాలు దూరమైంది అప్పటినుంచే. వాటికి గతేడాది విడుదలైన ‘ఓకే బంగారం’ సినిమాతో చెక్ పెట్టేసిన మణిరత్నం వెంటనే మరో సినిమాని పట్టాలెక్కించేశారు. ఇప్పుడది తుది దశకు చేరుకుంది. అంటే విడుదలకు తయారయినట్టే. ప్రయోగాలను పక్కనపెట్టి తనకి అచ్చొచ్చిన ప్రేమకథతో చాన్నాళ్ల తర్వాత ఓ హిట్ కొట్టిన మణిరత్నం ఈ సారి కూడా ప్రేమకథతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.కార్తీ, అదితిరావు హైదరీ జంటగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘కాట్రు వెలియిడై’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

ఊటీ, హైదరాబాద్, లడఖ్ వంటి ప్రాంతాల్లో మెజారిటీ షూటింగ్ పూర్తి కాగా మిగిలింది కేవలం ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమేనట. ఇది పూర్తవగానే నిర్మాణాంతర కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. ఎంత కాదనుకున్నా డిసెంబర్ నాటికి అన్నీ పూర్తవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తే సంక్రాంతి సినిమాల లిస్ట్ లో ఈ సినిమా చేరడం ఖాయం. అయితే పండగ హడావిడి పోయాక నిదానంగా తెరలేపుదాం అనుకుంటే చెప్పలేం. ఎందుకంటే… మణిరత్నం సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. పైగా కార్తీ హీరో. అప్పుడు చిరు, బాలయ్య వంటి హీరోలతో పోటీ పడాల్సి వస్తుంది. తమిళ నాట కూడా విజయ్ వంటి అగ్ర హీరోలు తమ సినిమాలను పెద్ద పండక్కి ముస్తాబు చేస్తున్నారు. ఈ పరిస్థితిల్లో సినిమా విడుదలపై మణిరత్నం నిర్ణయం ఏమిటో మరి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus