రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో సినిమా ప్రారంభం

  • March 30, 2017 / 06:26 AM IST

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా తన కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు. శ్రీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కొసరాజు రామ్మోహనరావు క్లాప్‌ ఇచ్చారు.

గతేడాది రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ’లో రామ్‌ను దర్శకుడు సరికొత్తగా చూపించారు. ఇప్పుడీ కొత్త చిత్రంలోనూ రామ్‌ లుక్, బాడీ లాంగ్వేజ్‌లను సరికొత్తగా చూపించనున్నారు. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ – ‘‘రామ్‌ లుక్‌ దగ్గర్నుంచి సై్టల్‌ వరకూ ప్రతిదీ కొత్తగా ఉంటాయి. ‘నేను శైలజ’ తర్వాత కిశోర్‌ తిరుమల మరోసారి రామ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే మంచి కథ రెడీ చేశాడు. ఏప్రిల్‌ 24న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు.

దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ – ‘‘ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ‘నేను శైలజ’ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. యువ హీరో శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus