కన్నడ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన దిలీప్ రాజ్ (47) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున తన ఇంట్లో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలియజేశారు. దీంతో ఆయన ఇకలేరు అంటూ కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో ప్రవేశం ఉన్న ఆల్రౌండర్ లాంటి దిలీప్ రాజ్ మృతి ఇండస్ట్రీకి తీరనిలోటు అని పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
పునీత్ రాజ్కుమార్ నటించిన ‘మిలానా’ సినిమాతో 2007లో దిలీప్ రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘యు టర్న్’ సినిమాలో కీలక పాత్ర పోషించి తనలోని వెర్సటాలిటీని ప్రేక్షకులకు చూపించారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ దిలీప్ రాజ్ రాణించారు. సినిమా పరిశ్రమలోనే కాదు టీవీల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో కొన్ని టీవీ సీరియళ్లను నిర్మించారు. కొన్ని సీరియల్లలో ప్రధాన పాత్ర పోషించి టీవీ ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు దిలీప్ రాజ్.
2007లో ‘మిలానా’తో అందరికీ సుపరిచితమైన దిలీప్రాజ్ 2005లోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘బాయ్ ఫ్రెండ్’ అనే సినిమాలో నటించారు. ఆయన ఆఖరి సినిమా ‘లవ్ మాక్టెయిల్ 3’. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలైన ఆఖరి సినిమా అంటే ‘నిమ్మ వస్తుగలిగే నీవే జవాబ్దారరు’. ‘విద్యా వినాయక’, ‘పారు’, ‘హిట్లర్ కల్యాణ’ సీరియళ్లు ఆయన నిర్మాణంలోనివే. ‘పారు’, ‘హిట్లర్ కల్యాణ’ ఇంకా టెలీకాస్ట్ అవుతున్నాయి.