కమల్ హాసన్, రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఓ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు కూడా. ఆ వీడియో బట్టి ఈ సినిమా వింటేజ్ కమల్, రజనీని చూపిస్తుంది అని చెప్పొచ్చు. అయితే సినిమా అనౌన్స్మెంట్ కోసం మాత్రమే ఆ వీడియో చేశారని.. కథకు ఆ లైన్కు సంబంధం లేదు అని అంటున్నారు. ఈ క్లారిటీ సంగతి అటుంచితే మరో రూమర్ బయటికొచ్చింది. దాంతోపాటు క్లారిటీ కూడా వచ్చేసింది.
కమల్ – రజనీ మూడు దశాబ్దాల తర్వాత కలసి నటిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుందని తెలిసింది. ఈ విషయం శ్రుతి దగ్గర ప్రస్తావిస్తే.. తాను ఈ ప్రాజెక్ట్లో నటించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ‘కూలీ’ సినిమాలో రజనీకాంత్తో కలసి నటించాక ఆయనకు వీరాభిమానిగా మారినట్లు చెప్పింది.
అయితే, శ్రుతి హాసన్ ఇలా చెబుతున్నా.. ఈ సినిమా ప్రాజెక్ట్లో ఆమె నటిస్తుండటం నిజమే అని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఈ సినిమా ఓ యువతి చుట్టూ తిరుగుతుందని.. ఆమె కోసం ఇద్దరు సీనియర్ హీరోలు కలసి వెతుకుతారని.. ఈ క్రమంలో కాస్త వినోదం, ఇంకాస్త యాక్షన్ కలగలిపి దర్శకుడు నెల్సన్ ఈ కథ రాసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘జైలర్ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా కోసం సిద్ధమవుతారు అని టాక్.
అయితే, సూర్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఓ సినిమా చేస్తారని టాక్ నడించింది. ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమాను సూర్యతో చేస్తున్నారు అని వార్తలొచ్చాయి. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.