టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అంటే ఒకప్పుడు ‘మినిమం గ్యారెంటీ హిట్’ అనే పేరు ఉండేది. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ సిరీస్తో ఆయన సృష్టించిన ప్రభంజనం చిన్న సినిమాల స్థాయిని మార్చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో సిద్ధు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తన కెరీర్ ప్లానింగ్ను మార్చుకుంటూ, డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం సిద్ధు చేతిలో రెండు భారీ సినిమాలు ఉండగానే, మూడో ప్రాజెక్టుగా ఒక వెబ్ సిరీస్ను పట్టాలెక్కించబోతున్నారు. గతంలో ఈయన ‘గ్యాంగ్స్టర్స్’ అనే సిరీస్ చేసినప్పటికీ, అప్పట్లో తెలుగు ఓటీటీ మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అది పెద్దగా క్లిక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుకే నెట్ఫ్లిక్స్ భారీ బడ్జెట్తో సిద్ధు కోసం ఈ కొత్త ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది.
ఈ సిరీస్లో స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్, నెట్ఫ్లిక్స్తో కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది. కొత్త దర్శకుడు ఈ సిరీస్ను హ్యాండిల్ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి పర్యవేక్షణలో ఈ సిరీస్ రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఓ మోస్తరు సినిమాలు ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమాలను సైతం విజయం సాధించిన సినిమాలు అని ప్రచారం చేస్తూ ఆ సినిమాకు ప్రాణం పోయటంలో నాగవంశీ సిద్ధహస్తులు. వసూళ్ల విషయంలో వాటిని చెప్పడంలో ఆయన స్టైలే వేరు. దేవర సినిమా సమయంలో మీరు దీన్ని గమనించే ఉంటారు.
అలా సినిమా ప్రమోషన్లలో కింగ్ అనిపించుకునే నాగవంశీ, ఇప్పుడు వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా పబ్లిసిటీతో వెబ్ సిరీస్లకు ఉండే క్రేజ్ దృష్ట్యా, ఈ ప్రాజెక్టు సిద్ధు కెరీర్కు మళ్ళీ పూర్వ వైభవం తెస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ గనుక హిట్టయితే, సిద్ధు జొన్నలగడ్డ మళ్ళీ తన ‘స్టార్ బాయ్’ ఇమేజ్ను సుస్థిరం చేసుకోవడం ఖాయం.