సినిమా హిట్ అయితే సీక్వెల్ ఆలోచన రావడం కొత్తేమీ కాదు. అలాంటి సినిమాల్లో నటించడమూ కొత్త కాదు. కానీ ఒకేసారి రెండు సీక్వెల్ సినిమాల్లో ఓ హీరో నటించడం మాత్రం కొత్తే. అంతేకాదు ఆ నెంబరు మూడుకు పెరుగుతుంది అనే వార్తలు వస్తుండటం గమనార్హం. ఇప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన ఫీట్ చేస్తున్న హీరో తేజ సజ్జా. ‘హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాల విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు అదే జోషల్లో రెండు సినిమాలను సెట్స్ మీద పెట్టేశాడు.
ఆ రెండు సినిమాలే ‘మిరాయ్ 2’, ‘జాంబి రెడ్డి 2’. రీసెంట్గా రెండో ‘మిరాయ్’ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇప్పుడు రెండో ‘జాంబి రెడ్డి’ సినిమా షూటింగ్ మొదలైంది అని సమాచారం. అదేంటి ఎక్కడా సోషల్ మీడియాలో ఈ మేరకు సినిమా టీమ్ నుండి అప్డేట్లు లేవు అని అనుకుంటున్నారా? ఉండవు ఎందుకంటే ఈ రెండు సినిమాలకు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాబట్టి. వాళ్లు సినిమా ముహూర్తం, ప్రారంభం గురించి బయట ప్రచారం చేయరు కాబట్టి.
ఇప్పటికే ‘మిరాయ్ 2’కి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తి చేసిన తేజ ‘జాంబి రెడ్డి 2’ని సెట్స్పైకి తీసుకెళ్లారట. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘జాంబి రెడ్డి’ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా ఇది. ఈసారి ఆయన కథ మాత్రమే అందిస్తున్నారు. ఆయన దర్శక బృందంలో ఒకరు దర్శకత్వం వహిస్తున్నారట. ఇదిలా ఉండగా ప్రస్తుతం తేజ చేస్తున్న రెండు సినిమాల్లో ‘జాంబి రెడ్డి 2’నే ముందుగా విడుదల అవుతుందని సమాచారం.
ఇదిలా ఉంగా ‘హను – మాన్’ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’లో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కూడా తేజ సజ్జా కనిపిస్తాడు అని సమాచారం. ఆ లెక్కన మొత్తం మూడు సీక్వెల్స్లో ఆయన నటిస్తున్నట్లు లెక్క.