తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్ జరిగిన 24 గంటల లోపే TFDC చైర్మన్ హోదాలో దిల్ రాజు (Dil Raju) ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఈవెంట్ బాగా జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం 1 గంట కేటాయించబడినా, దిల్ రాజు పర్సనల్ రిక్వెస్ట్ మేరకు 2.15 గంటలపైనే ఉన్నారని, తెలంగాణ ఆవిర్భావం నుండి 2024 వరకు అన్నీ సినిమాలకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి విషయమని దిల్ రాజు పేర్కొన్నారు.
ఈ ఈవెంట్ విషయంలో ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా నిర్వాహకుడిగా తనను క్షమించాలని కోరారు దిల్ రాజు. అయితే.. ఇదే సందర్భంలో కొందరు సెలబ్రిటీలు వేడుకకు హాజరుకాకపోవడం పట్ల ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నప్పుడు కచ్చితంగా హాజరవ్వాలి, అంతేకానీ షూటింగ్ ఉందని డుమ్మా కొట్టడం సరికాదని, ప్రభుత్వంతో ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్లకి గౌరవం ఇవ్వాలని ఇండైరెక్ట్ క్లాస్ పీకారు దిల్ రాజు.
ఆయన ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ విషయమై ప్రభుత్వం సీరియస్ అయ్యి, దిల్ రాజుతో ఆ మాట చెప్పించిందా? లేక దిల్ రాజు ముందు జాగ్రత్తగా తానే ఇండస్ట్రీకి మెసేజ్ ఇచ్చాడా? అనేది తెలియాల్సి ఉండగా.. ఒకవేళ ఈ విషయమై ప్రభుత్వం సీరియస్ అయితే గనుక.. భవిష్యత్ లో ప్రభుత్వం-సినీ పరిశ్రమ మధ్య సఖ్యత ఎలా ఉంటుంది? మళ్లీ టార్గెట్ చేయడం గట్రాలు ఏమైనా జరుగుతాయా? అనేది చూడాలి.
ఆల్రెడీ తెలంగాణలో టికెట్ హైక్స్ లేక బడా సినిమాలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దిల్ రాజు కామెంట్స్ పై ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.