డిసెంబర్ 13న అల్లు అర్జున్ (Allu Arjun) ను తెలంగాణ పోలీసులు సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడిగా ఆమోదిస్తూ అరెస్ట్ చేసిన రోజును ఎవ్వరూ మర్చిపోలేరు. యావత్ భారతీయ చిత్రసీమ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలవగా సినిమా అభిమానులందరూ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీ బిహేవియర్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. ఆ తర్వాత ఆ ఇష్యూ సైలెంట్ అయిపోయిందనుకోండి.
అయితే.. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్స్ ను ప్రకటించినప్పటినుండి, మరీ ముఖ్యంగా 2024 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ కి “బెస్ట్ యాక్టర్” అవార్డ్ ప్రకటించడం అనేది చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇవాళ (జూన్ 14) హైదరాబాద్ నోవోటెల్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన గద్దర్ అవార్డ్స్ ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇకపోతే.. అవార్డ్ అందుకున్న అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ, తనకు వచ్చిన అవార్డును తన అభిమానులకు అంకితం ఇవ్వడమే కాకుండా “పుష్ప 2” సినిమాలోని “రప్పా రప్పా” డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే.. ఆ డైలాగ్ రేవంత్ రెడ్డికి సెటైర్ లా ఉంది. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన చుట్టూ జరిగిన రచ్చ చూసాక.. ఇలా అనిపించడంలో తప్పు లేదు మరి. ఇక అల్లు అర్జున్ అభిమానులను సోషల్ మీడియాలో ఆపడం కష్టమే. వాళ్ళందరూ ఎదురుచూసిన మూమెంట్ ఇది.