అదేంటో టాలీవుడ్లో ఉండే కష్టాలన్నీ మెగా ఫ్యామిలీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటేనే బయటకు వస్తాయి. ఈ మాట మేం అనడం లేదు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న విషయాలు.. అంతకుమందు ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలప్పుడు జరిగిన అంశాలు చూస్తే ఇదే అర్థమవుతోంది. సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ఇలా ప్రదర్శన రంగానికి సంబంధించిన అంశాలు బయటకు వచ్చేశాయి. ఇప్పుడు కూడా అద్దె విధానం గురించి చర్చ జరుగుతోంది.
నిన్న మొన్నటివరకు ‘పెద్ది’ సినిమాకు, అద్దె విధానం X పర్సంటేజీ విధానం గురించి చర్చకు సంబంధం లేదు అంటూ చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇప్పుడు అద్దె విధానం, పర్సంటేజీ విధానం సంగతి తేలేంత వరకు ‘పెద్ది’ సినిమాను ప్రదర్శించం అని క్లారిటీ ఇచ్చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో 21 మంది సభ్యుల ప్రత్యేక కమిటీ రెండోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో అద్దె, పర్సంటేజీ విధానంపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ‘పెద్ది’ చిత్రాన్ని అద్దె విధానంలో ప్రదర్శించలేమని కొంతమంది ఎగ్జిబిటర్లు తెలిపారు.
అయితే ఈ నిర్ణయంపై కొందరు నిర్మాతలు మండిపడ్డారు. విషయం సింగిల్ స్క్రీన్స్లో సినిమాలను ఎలా ప్రదర్శించాలి అనే అంశంపై కమిటీ వేసుకొని చర్చలు జరుగుతున్న సమయంలో ఇలా పట్టుబట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది పరిశ్రమ పెద్దలకే తెలియాలి. ఒకవేళ ఎగ్జిబిటర్లు, నిర్మాతల ఎవరి పట్టు వారు పడితే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘పెద్ది’ సినిమా వేసే అవకాశం ఉండదు అని చెప్పొచ్చు. అయితే ఈ పరిస్థితి తెలంగాణ వరకు మాత్రమేనా? లేక ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లు/ ఎగ్జిబిటర్లు కూడా ఇలానే ఆలోచిస్తారా అనేది చూడాలి.
సింగిల్ స్క్రీన్లలో ‘పెద్ది’ సినిమా ప్రదర్శించడం గురించి మంగళవారం స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజున మరోసారి భేటీ అయి ఈ విషయాన్ని తేల్చేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. అయితే ‘పెద్ది’ సినిమాకు తమ నిరసనకు సంబంధం లేదని చెప్పినవారు ఇప్పుడు ఇలా మాట్లాడటం అసలు పరిస్థితి ఏంటి అనేది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేస్తోంది.