‘‘నన్ను అన్నావు కాబట్టి సరిపోయింది.. అదే మావోడిని అన్నావో.. నీ సంగతి చూస్తాడు’’ ఈ మాట మీరు చిన్నతనంలో వినుంటారు. లేదంటే మీరే అనుంటారు కూడా. ఆ మాట వినడానికి సరదాగా ఉంటుంది. కాస్త ధైర్యంగా కూడా కనిపిస్తుంది. అలాగే ‘మావోడు’ సత్తా కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు టాలీవుడ్ యువ నిర్మాత ఒకరు ఇదే మాట అన్నారు. దీంతో ఆయనకు సపోర్టు వస్తోంది.. విమర్శలూ వస్తున్నాయి.
స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఓ సొంత బ్యానర్ ఉందనే విషయం తెలిసిందే. ఆ బ్యానర్ పెట్టుకునే ఆయన దర్శకుడిగా తొలి సినిమాను తెరకెక్కించిన విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. అదే భద్రకాళి ప్రొడక్షన్స్. ఇప్పటికీ ఆయన తెరకెక్కించే సినిమాలకు ఈ బ్యానర్ కొలాబరేషన్ తప్పనిసరి. అన్నట్లు ఈ బ్యానర్ను హ్యాండిల్ చేసేది ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా. ఆయన ఇప్పుడు స్ట్రయిట్గా సుమంత్ ప్రభాస్తో ‘రొమాంచకం’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా రీసెంట్గా విడులైంది.
మామూలుగా అయితే సినిమా డిజాస్టర్ అయినా ‘మాకు ఎలాంటి నష్టం జరగలేదు’ అని చెప్పుకునే నిర్మాతలున్న ఈ టాలీవుడ్లో ప్రణయ్ రెడ్డి మాత్రం ఈ సినిమాకు వచ్చిన స్పందన పట్ల సంతృప్తిగా లేరు. రివ్యూలు బ్యాడ్గా వచ్చాయని, సమీక్ష పేరుతో రివ్యూవర్లు కొంతమంది కోడి గుడ్డుపై ఈకలు పీకారని ఆందోళన చెందారు. అయితే ఆయన అక్కడితే ఆగలేదు. పైన మేం చెప్పిన ‘మావోడు వస్తాడు.. అప్పుడు చూద్దాం’ అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రణయ్ మాట్లాడుతూ ‘రొమాంచకం’ చిన్న సినిమా కాబట్టి వంకలు పెట్టారు. కానీ నెక్స్ట్ ఇయర్ మా ‘స్పిరిట్’ వస్తుంది. అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. నిజానికి ఆ సినిమాకు భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ – సందీప్ వంగా కాంబో కాబట్టి ఆ అంచనాలు ఉన్నాయి. అయితే అంతకుమించిన అంచనాలతో వచ్చిన ప్రభాస్ సినిమాలు దెబ్బతిన్నాయి. రివ్యూయర్స్ ఏకిపారేశారు. కాబట్టి ప్రణయ్ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్టో ఆయనే తెలుసుకోవాలి.