‘ఇరుముడి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ సినిమా సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఎందుకు అలా అన్నారో, ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏంటో తెలియదు కానీ.. అప్పటి నుండి ఈ సినిమాలో రామ్చరణ్ కనిపిస్తాడు అనే రూమర్ వండేశారు. ‘మల్లెపూల పల్లకి..’ అనే పాటలో మాల వేసుకున్న రామ్చరణ్ కనిపిస్తాడు అని ఆ రూమర్ల సారాంశం. ఈ విషయంలో సినిమా టీమ్ రియాక్ట్ కాకపోవడంతో నిజంగానే చరణ్ ఉన్నాడేమో అనుకున్నారంతా.
అయితే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నట్లుగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించడం లేదు అని తెలిపింది. అవి రూమర్స్ మాత్రమే అని తేల్చింది. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేసింది. దీంతో ‘ఇరుముడి’ సినిమాకు గత రెండు రోజులుగా ఉన్న హైప్ ఒక్కసారిగా తగ్గింది అని చెప్పాలి. చరణ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది కానీ.. జీవీ ప్రకాశ్ చెప్పిన ఆ సర్ప్రైజ్ ఏంటి అనేదే ఇక్కడ ప్రశ్న. మరే హీరో ఆ పాటలో ఉంటారో చూడాలి.
ఇక ‘ఇరుముడి’ సినిమా గురించి చూస్తే.. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకుంటే అతడు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్కడే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఈ అంశాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు శివ నిర్వాణ చెప్పారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా, కూతురు పాత్రలో బేబీ నక్షత్ర నటించింది.
సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో వచ్చిన రవితేజ మంచి ఫలితం అందుకున్నా అది మాస్ మహారాజ స్థాయి సినిమా కాదు. ఇప్పుడు ఈ సినిమాతో ఆ స్థాయి విజయం అందుకోవాలని చూస్తున్నాడు.