దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చారు : మనీషా కొయిరాలా

  • June 13, 2018 / 11:01 AM IST

“నెల్లూరి నెరజాణ” గా తెలుగు ప్రజలకు పరిచయమైన నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా… బాలీవుడ్ లో కొన్నేళ్లపాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. పెళ్లి చేసుకొని ఆనందగా జీవించాలన్న సమయంలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఉన్నట్లు తెలియడంతో బాధపడకుండా భర్తకు విడాకులు ఇచ్చి న్యూ యార్క్ లో చికిత్స తీసుకుంది. ఒంటరిగా క్యాన్సర్ పై పోరాడి గెలిచింది.  “డియర్‌ మాయా” తో హిట్ కొట్టి మళ్ళీ బిజీ అయింది. ప్రస్తుతం “సంజు” చిత్రంలో నర్గిస్‌ దత్‌ పాత్రను పోషించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

“2010లో నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సమ్రాట్‌ దహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ రెండేళ్లకే మేం విడిపోయాం. పెళ్లి విషయంలో తప్పు నాదే. బహుశా నా జీవితంలో ప్రేమ, పెళ్లికి చోటు లేదేమో. అయినా పర్వాలేదు. మరో తప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉండటం కంటే నా జీవితంలో ప్రేమకు చోటు లేదు అన్న చేదు నిజాన్ని అంగీకరించడమే మంచిది. నా జీవితాన్ని వెనక్కి నెట్టే అవకాశం మరో వ్యక్తికి ఇవ్వను. దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోను. కానీ ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను.”అని తెలిపారు. అనంతరం ‘సంజు’ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..”నర్గిస్‌ దత్‌ పాత్రలో నటిస్తున్నాను కాబట్టి తనలాగే జుట్టు వేసుకుని, మేకప్‌ పూసుకుంటే సరిపోదు. ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోగలగాలి.

అదీకాకుండా నర్గిస్‌ కూడా నాలాగే క్యాన్సర్‌తో బాధపడ్డారు. కాబట్టి ఆమె అనుభవించిన బాధ నాకు తెలుసు. ఏ పాత్రనైనా రిహార్సల్స్‌ లేకుండా నటించగలిగే సామర్ధ్యం ఉంది. కానీ నర్గిస్ పాత్రను అలా చేయలేను. అందుకే సినిమా చిత్రీకరణకు ముందు ఆమె జీవితం గురించి ఎంతో పరిశోధన చేశాను” అని మనీషా వివరించారు. మనిషా డెడికేషన్ చూస్తుంటే హీరోయిన్ గానే కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగాను అవార్డులు అందుకోవడం గ్యారంటీ అనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus