టాలీవుడ్లో ఈ సంక్రాంతికి ఐదుగురు హీరోలు, నలుగురు దర్శకులకు చాలా స్పెషల్ అయితే.. ఒక హీరో, ఒక దర్శకుడి చేదు మందు. సినిమా మీద నమ్మకమో, లేక నమ్మకం లేకనో కానీ ప్రచారంలో కాస్త ఓవర్ చేశారు. లేని పోని కామెంట్లు చేసి, ఆ తర్వాత సినిమా ఫలితం వచ్చాక మిన్నకున్నారు. అయితే అప్పటివరకు చేసిన కామెంట్ల ప్రభావం హీరోకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకపోయినా, దర్శకుడిని చాలా ఇబ్బంది పెట్టాయి. దర్శకుడి ఫ్రెండ్ కామెంట్లు కూడా ఈ పరిస్థితికి ఓ కారణం. అందుకే పోయిన చోటే సంపాదించుకోవాలని ఆ దర్శకుడు ఫిక్స్ అయ్యారని సమాచారం.
ఆ హీరో ప్రభాస్ అని, ఆ దర్శకుడు మారుతి అని.. ఆ కామెంట్లలో ఇంటి అడ్రెస్లు చెప్పడం ఒకటి, ఇంకొకటి చొక్కాల మీద, స్టేజీ మీద చేసిన అతి కామెంట్లు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ.. ఏ సంక్రాంతి అయితే తనకు తీవ్రమైన బాధను కలిగించిందో అదే సంక్రాంతి ఇంగ్లిష్ పేరును తీసుకొని ‘హే పొంగల్’ అనే టైటిల్తో సినిమా చేయాలని మారుతి ఫిక్స్ అయ్యారట. ఆ పేరు పెట్టారు అంటే ఆటోమేటిగ్గా సంక్రాంతి సీజన్ రిలీజ్ కోసం చూస్తారు. ఈ సినిమాకు ఇంకా హీరో, నిర్మాత ఫిక్స్ అవ్వలేదు అని అంటున్నారు.
ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఉంటుంది అని మారుతి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాకు డబ్బులు పెట్టడానికి ఏ నిర్మాత ముందుకొస్తారు అనేది చూడాలి. ఇక హీరో విషయానికొస్తే మెగా ఫ్యామిలీ హీరోల గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అల్లు హీరోలు అయితే ఈ సినిమా చేసే పరిస్థితి లేదు. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక శిరీష్ అయితే ఇప్పుడు సినిమాలు చేయడం లేదు.
ఆ లెక్కన మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రమే మారుతి ఈ సినిమా చేయాలి. మరీ కొత్త హీరోతో, చిన్న హీరోతో సినిమా అంటే సంక్రాంతి సీజన్లో నిలబడటం కష్టమే. గతంలో సినిమాలు చేసిన నాని ఇప్పుడు పాన్ ఇండియా బిజీలో ఉన్నాడు. శర్వానంద్ అయితే శ్రీను వైట్ల సినిమాతో సంక్రాంతికి వస్తానని ఇప్పటికే చెప్పేశారు.