‘ఒకటే పని చేసేనాకి.. ఒకేనాక బతికేనాకి ఇంతపెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల.. పుడతామా ఏంటి మళ్లీ’.. ఈ డైలాగ్ గుర్తుందా? ‘పెద్ది’ని ప్రేక్షకులకు తొలి పరిచయం చేయడానికి దర్శకుడు బుచ్చిబాబు సానా వాడుకున్న ఆయుధం. ఆ టీజర్లో ఉన్న ఏకైక డైలాగ్.. మిగిలిందంతా యాక్షన్. కానీ ఈ డైలాగ్ బాగా గుర్తుండిపోయింది. కారణం అందులోని పవర్. ఇప్పుడు అలాంటి డైలాగ్ మరొకటి బయటకు వచ్చింది. సినిమా మేకింగ్ వీడియోలో ఈ డైలాగ్ బయటకొచ్చింది.
‘ఎగస్పార్టీకి ధూపమెయ్యాలంటే ఈ మాత్రం మంటెట్టాల్లేరా!’… డైలాగ్ భలేగా ఉంది కదా. ఈ డైలాగ్ ‘పెద్ది’ సినిమాలో ఉండబోతోంది. అదేంటి సినిమా రిలీజ్కి ముందే ఇంత మంచి డైలాగ్ బయటకు చెప్పేశారా.. అంటే చెప్పేశారు. దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం కొన్ని ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులోనే ఈ డైలాగ్ఉంది. వీడియో లాస్ట్లో రామ్చరణ్ ఈ డైలాగ్ చెప్పాడు. మామూలుగా అయితే థియేటర్లలో విజల్స్, కేకలు మారుమోగే డైలాగ్ ఇది. కానీ సోషల్ మీడియాలో కాబట్టి లైక్లు మారుమోగుతున్నాయి.
ఈ పోస్ట్తో రిలీజ్ చేసిన ఓ ఫొటోలో బ్యాటు పట్టుకుని రామ్చరణ్ ఓ సీరియస్ లుక్ ఇస్తూ కనిపించాడు. ఆ లుక్ ఎలా ఇవ్వాలో బుచ్చిబాబు పక్కనే కూర్చుని చూపించారు. ‘పెద్ది’ విత్ ‘పెద్ది’ క్రియేటర్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్య అంశాలతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్ డ్రామా చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది.
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే మార్చి 27న విడుదలై ఉండేది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఆ సమయానికి అవ్వవు అని.. సినిమాను ఏప్రిల్ 30కి తీసుకెళ్లిపోయారు. చరణ్ వదిలేసిన డేట్ను బాబాయ్ పవన్ కల్యాణ్తో ఫిల్ చేయడంతో అభిమానులు ఖుష్ అయిపోయారు. మరి ‘పెద్ది’ బాక్సాఫీసుకు దూల తీర్చి… ధూపం వేసే రోజు కోసం మీరు రెడీనా?