తనని మోసం చేశాడంటూ హీరో సతీష్ పై ఫిర్యాదు చేసిన నిర్మాత

  • August 25, 2018 / 07:46 AM IST

యువ నటుడు సతీష్, రష్మీ హీరో హీరోయిన్లుగా నటించిన “అంతకుమించి” సినిమా నిన్న రిలీజ్ అయి మిశ్రమస్పందన అందుకుంది. అయితే రిలీజ్ అయిన ఒక రోజైనా కాకముందే ఈ చిత్ర హీరోపై కేసు నమోదయింది. తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా సినిమా హీరో, నిర్మాత సతీష్ తనని మోసం చేశాడని శ్రీకృష్ణ క్రియేషన్స్ ప్రతినిధి, నిర్మాత గౌరీకృష్ణ ప్రసాద్ ఆరోపించారు. మొదట తాను ‘అంతకుమించి’ సినిమా పేరును రిజిస్టర్ చేయించి షూటింగ్ ను మొదలుపెట్టానని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా నిర్మాణం ఆగిపోగా కమలాపురి కాలనీకి చెందిన సతీష్ జాయ్ ముందుకొచ్చాడన్నారు. సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా నటించడానికి ముందుకు వచ్చాడని వివరించారు.

సినిమా టైటిల్ తో పాటు ఇప్పటివరకూ చేసిన ఖర్చుకుగానూ 50 లక్షలు ఇస్తానని మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ సినిమా పూర్తయినా తనకు డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. దీంతో తాను కోర్టును ఆశ్రయించగా సినిమాను వచ్చే నెల 4 వరకూ విడుదల చేయొద్దని న్యాయస్థానం ఆదేశించిందని ప్రసాద్ స్పష్టం చేశారు. కానీ సతీష్ మాత్రం ఈలోపే సినిమాను విడుదల చేశాడన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటు తనను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాతో చెప్పారు. ఈ కేస్ పై పోలీసుల వివరణ రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus