ఈ మధ్య రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)… ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఏదైనా ఈవెంట్ కి వెళితే చాలు.. అత్యుత్సాహం ప్రదర్శించి సోషల్ మీడియా జనాలకి దొరికిపోతున్నారు.
రాజేంద్రసాద్ వస్తున్నారు అంటే.. మీడియా కెమెరాలు కూడా ఆయనపై స్పెషల్ ఫోకస్ పెట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా రాజేంద్రప్రసాద్ జాగ్రత్త పడటం లేదు.
ఇటీవల ఆయన సీనియర్ నటులు కాంతరావు గారి గురించి గొప్పగా మాట్లాడే క్రమంలో ఎం.జి.ఆర్ పై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.అది అందరికీ తెలిసిందే. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. తమిళ సినిమా పరిశ్రమకి చెందిన వారు అలాగే తమిళ ప్రేక్షకులు రాజేంద్రప్రసాద్ కామెంట్స్ ను వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో రాజేంద్రప్రసాద్ వారికి క్షమాపణలు తెలుపుతూ ఒక వీడియో వదిలారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…”2 రోజుల క్రితం ఇక్కడ ఓ కార్యక్రమం జరిగింది. అందులో మా టాలీవుడ్ కి చెందిన సీనియర్ నటులు కాంతారావు గారి అవార్డు ఇచ్చారు.
ఆ ఫంక్షన్లో నేను మాట్లాడుతున్నప్పుడు… ‘నేను చాలా సరదా, సరదాగా మాట్లాడుతున్న క్రమంలో… తమిళ సినిమా దైవం అయినటువంటి ఎం.జి.ఆర్ గారి గురించి ఒక మాట పొరపాటున వచ్చేసింది.దాన్ని కొందరు కావాలని ఇప్పుడు పెద్దది చేసి చూపిస్తున్నారు. నేను ఆయన గురించి అలా మాట్లాడతానా? నాకు అంత ధైర్యం ఎక్కడిది? నేను మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నప్పుడు ఆయనే సీఎం. మేము యాక్టింగ్ ఎలా నేర్చుకుంటున్నామో అని ఆయన స్వయంగా వచ్చి చూసేవారు.
ఆయన గురించి తప్పుగా మాట్లాడే అంత సంస్కారం లేని వాడిని కాదు. ఏది ఏమైనా, అలా పొరపాటున దొర్లిన ఆ మాట వల్ల మీలో ఎవరైనా బాధపడి ఉంటే… నన్ను క్షమించండి. ఇక ముందు నా జీవితంలో ఎప్పుడూ అలా మాట్లాడను అని మీకు మాట ఇస్తున్నాను. ఈ సారికి నన్ను క్షమించి వదిలేయండి.మీ రాజేంద్ర ప్రసాద్” అంటూ చెప్పుకొచ్చారు.