దర్శక నిర్మాతలపై మండిపడ్డ సిమ్రాన్

  • August 21, 2018 / 07:38 AM IST

అబ్బాయిగారి పెళ్లితో తెలుగులో అడుగుపెట్టిన సిమ్రాన్ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జులతో కలిసి నటించి ఎన్నో హిట్స్ అందుకుంది. “సమర సింహా రెడ్డి”, “కలిసుందాం రా”, “నరసింహనాయుడు”, నువ్వు వస్తావని.. వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పెళ్లి తర్వాత విశాల్‌ నటించిన “తుప్పరివాళన్” సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. పిజ్జా, జిగర్‌తండ, ఇరైవి చిత్రాలతో ప్రతిభను చాటుకున్న కార్తీక్ సుబ్బరాజు దక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ తో సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రాన్ నటిస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ డార్జిలింగ్ లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సిమ్రాన్ ని సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎటువంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అని అడిగితే… ‘‘కచ్చితంగా అమ్మ పాత్రలు మాత్రం కాదు’’ అని చమత్కరించారు.

పెళ్లైన నటీమణుల విషయంలో దర్శక నిర్మాతలు, రచయితల మైండ్‌సెట్‌ మారాలని ఆమె హితవు పలికారు. ‘‘హిందీలో చూడండి… ‘ఫన్నే ఖాన్‌’లో ఐశ్వర్యారాయ్‌, ‘వీరే ది వెడ్డింగ్‌’లో కరీనాకపూర్‌ అద్భుతమైన పాత్రలు చేశారు. వాళ్లు ఏమైనా సల్మాన్‌ ఖాన్‌కి అమ్మగా నటించారా? లేదు కదా! ఆర్టిస్టులను ఆ విధంగా గౌరవించాలి. పెళ్లయితే… అమ్మ పాత్రలే ఇస్తారా!?’’ అని సిమ్రాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో పాత్ర నచ్చకుంటే నాయికలు తిరస్కరించే హక్కు ఉంటుందని, అలా చేయడం వల్లే నయనతార, త్రిషకు విభిన్న చిత్రాల్లో నటించే అవకాశం దక్కుతోందని చెప్పారు. రజినీ కాంత్ తో చేస్తున్న మూవీ హిట్ అయితే సిమ్రాన్ కి హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు దక్కే ఆస్కారం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus