సంగీత జల్లులతో తడిపి మైమరపించిన  ‘తమన్’ సుస్వరాల సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’

  • June 6, 2022 / 10:45 PM IST

రెండున్నర సంవత్సరాల తరువాత ‘కోవిడ్’ అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం ‘సుస్వర తమనీయం’, మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో, యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ,  సాకేత్ , పృథ్వి చంద్ర, విమల రోషిని , శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తది తరులు మరియు వాణిజ్య బృందంచే నిర్వహించ బడినది. జూన్ మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయం లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించ బడింది. ఈ మెగా ఇవెంట్ లో తెలుగు వారు దాదాపు 1500 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ దేశాల తెలుగు సంస్ధల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.

ఈవెంట్ స్పాన్సర్స్ ALMULLA EXCHANGE మరియు SUBHODAYAM వారి చేతుల మీదుగా దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కువైట్, ఇండియా జాతీయగీతాల అనంతరం ఈ కార్యక్రమానికి

ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇండియన్ ఎంబసీ కమ్యూనిటీ ఎఫైర్స్ & అసోసియేషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీ కమల్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. కువైట్ లో ముప్పై నాలుగు సంవత్సరాలు ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగు కళా సమితి తెలుగు సంస్కృతి సంప్రదాయ విలువలను కాపాడుతూ చేపడుతున్న ఎన్నో కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు.

తెలుగు కళా సమితి  కార్యవర్గ అధ్యక్షులు శ్రీ సాయి  సుబ్బారావు గారు మాట్లాడుతూ… విచ్చేసిన ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ గారికి మరియు విరాళాలను ఇచ్చిన స్పాన్సర్ కి, శ్రీ ఎస్.ఎస్. తమన్ బృందానికి, తెలుగు కళా సమితి సభ్యులకు, సలహాదారులకు,ఎన్నికల సంఘానికి, మరియు అన్నింటికీ వెన్నంటి వుండి నడిపిన తమ కార్యవర్గ సభ్యులకు తమ కృతజ్ఞతలను మరియు అభినందనలను తెలిపారు కార్యక్రమ విశేషాలు, మునుపటి కార్యక్రమాలను క్లుప్తంగా తెలియ పరిచారు.తెలుగు వారి మనసుల్లో పాటల రూపంలో మనసును ఆయన స్వరంతో సేదతీరుస్తూ చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీ. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి మరియు పలుకులనే బాణాలుగా చేసి మన గుండెలకు సంధించి వాటిలో మైమరచిపోయేలా చేసిన అద్భుతమైన కవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి తెలుగు కళా సమితి సభ్యులందరు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

“తెలుగు కళా సమితి” ఎగ్జిక్యూటివ్ కమిటీ మాట్లాడుతూ.. గత ఎన్నో సంవత్సరములుగా తెలుగు కళా సమితికి వెన్నంటే వుంటూ ఎన్నో ఈవెంట్స్ కి స్పాన్సర్స్ గా వుంటూ, ఈ కార్యక్రమం సుస్వర తమనీయానికి కూడా అదేవిధంగా ఆర్ధికంగా ఎంతో సపోర్ట్ చేస్తున్న మెయిన్ స్పాన్సర్లు ALMULLA EXCHANGE మరియు SUBHODAYAM PROPERTIES వారికి వారి ప్రోత్సాహానికి తమ ధన్యవాదములు తెలియజేసారు.

ప్రధాన కార్యదర్శి శ్రీ వత్స గారు మాట్లాడుతూ…కరోనా విజ్రింబిస్తున్న సమయంలో ఎంతో మందికి తెలుగు కళా సమితి ద్వారా చేపట్టిన  రక్తదాన శిబిరం ,ఆరోగ్య శిబిరం మరియు కోవిడ్ సమయం లో అవసరమైన ఔషదాలు, మాస్క్స్, నిత్యావసర వస్తవులను అందించడం జరిగింది. గురువారం జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ ఇవెంట్ ఎంతో అద్భుతంగా జరగడం  ఆనందదాయకం. సహాయ  సహ కారాలను అందించిన వారిని మరియు వారికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి తమ కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కమిటీ సభ్యులకు,దాతలుమరియు ప్రకటన కర్తలకు, తమన్ మరియు వారి బృందానికి, లేడీస్ వింగ్, వాలంటీర్స్, సలహాదారుల  కమిటి మరియు ఆటపాటలతో అలరించిన పిల్లలకు, పెద్దలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి తమ అభినందనలను ధన్యవాదములను తెలిపారు.

తమన్  బీట్స్ మరియు దాదాపు యాభై పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది సభ్యులందరు కేరింతలు,నృత్యాలు మరియు ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ సుస్వర తమనీయం ఆద్యతం అలరించింది.

తదనంతరం స్పాన్సర్స్ , తమన్ మరియు వారి బృందం, మిగతా సంస్థల అధ్యక్షులకు మరియు ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ గారిని “తెలుగు కళా  సమితి” కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించారు.

“తెలుగు కళా సమితి” స్మారక చిహ్నమైనటువంటి ‘సావెనీర్’  వార్షిక సంచికను తెలుగు కళా సమితి కార్యవర్గం అంగరంగ వైభవంగా విడుదల చేసారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus