ప్రముఖ కథానాయిక రష్మిక మందన ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. ‘మైసా’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె గాయపడినట్లు ఆమె పీఆర్ టీమ్ ఇటీవల ఓ నోట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఈ విషయమైన సుదీర్ఘమైన పోస్టు రాసుకొచ్చింది. గాయం కారణంగా తనకు నొప్పిగా ఉందని, అయితే అది భరించలేనంత స్థాయిలో లేదని రష్మిక ఆ పోస్టులో రాసుకొచ్చింది. అంతేకాదు ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి కూడా చేసింది.
గాయాలు తగిలినప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను గాయపడిన విషయం ఎవ్వరికీ తెలియకూడదనుకున్నాను. కానీ నాకు ఇది వరుసగా మూడో గాయం. నేను నా శరీరాన్ని ఓ యంత్రంలా కాకుండా, దేహంలా చూడటం నేర్చుకోవాలి అని రష్మిక కాస్త బరువైన పదాలతో తన పరిస్థితి చెప్పుకొచ్చింది. నడుము భాగం ఇరువైపులా నాలుగు టెండన్లు ఉంటాయి. అవి నడుమను, కాళ్లను కలిపి ఉంచుతాయి. నా హిప్ కుడివైపున ఓ టెండన్ విడిపోయిందట. అది మళ్లీ అతుక్కున్న తరువాతే బాగా నడవగలను అని పరిస్థితి చెప్పింది.
నాకు నేనుగా ఎప్పుడూ లీవ్ తీసుకోనని తెలిసి, దేవుడే ఇలా బలవంతంగా రెస్ట్ ఇచ్చాడేమో. ఈ విశ్రాంత సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. బోర్ కొట్టకుండా పజిల్స్ పరిష్కరిస్తున్నాను. రన్నింగ్, ఎక్సర్సైజ్లు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల బరువు పెరుగుతానేమో అని భయంగా ఉంది. ఖాళీ దొరికింది కదా అని ఫుడ్ బాగా లాగిస్తున్నాను. స్వీట్లు కనిపిస్తే డెజర్ట్ మాన్స్టర్ అయిపోతున్నాను అని చెప్పింది. మొత్తానికి బాధలో కూడా పాజిటివిటీ కలిపి తనెంత స్ట్రాంగ్ అనేది చెప్పకనే చెప్పింది రష్మిక మందన.
ఇక రష్మిక సినిమాల సంగతి చూస్తే.. చేతిలో వరుస ప్రాజెక్ట్లు ఉన్నాయి. వాటి ప్రచారం పనులూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తీవ్రమైన గాయమే అవ్వడంతో కొన్నాళ్లు సినిమాలకు పూర్తి దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో ఆయా సినిమాల షెడ్యూళ్లు మారిపోయి, విడుదల వాయిదా పడుతుంది.