మరో చిత్రాన్ని లైన్లో పెట్టిన రామ్..!

  • February 13, 2019 / 03:38 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రం చేస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని… తనే సొంతంగా నిర్మిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ కి నచ్చేలా రామ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత రామ్ మరో చిత్రాన్ని లైన్లో పెట్టబోతున్నాడట. జూన్ నుండీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళబోతుందట. గతంలో నారా రోహిత్, శ్రీవిష్ణు లతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి డీసెంట్ హిట్ అందుకున్న సాగర్ చంద్ర డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందబోతుందట. ఇటీవల సాగర్ చంద్ర వినిపించిన కథకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే ఈ కథని ముందుగా వరుణ్ తేజ్ కి వినిపించాడట సాగర్. ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ సంస్థ నిర్మించబోతుందని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా సాగర్ చంద్ర చిత్రం ప్లేస్ లో హరీష్ శంకర్ ‘వాల్మీకి’ చేరింది. దీంతో అదే కథని ఇప్పుడు రామ్ తో తెరకెక్కించబోతున్నాడు సాగర్. రామ్ సొంత బ్యానర్ అయిన ‘స్రవంతి మూవీస్’ బ్యానర్లో ఈ చిత్రం నిర్మితవుతుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus