ఓ అద్భుతమైన సినిమాకు అన్యాయం జరిగిపోయిందంటూ ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటించిన ఓ క్రైమ్ థ్రిల్లర్, తెలుగు ప్రేక్షకులకు ‘దృశ్యం’ లాంటి అనుభూతిని ఇచ్చే సత్తా ఉన్నా, ఎవరూ పట్టించుకోని అనాథలా మిగిలిపోయింది. సినిమా ఎంత గొప్పదైనా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రచారమే అసలు సిసలైన హీరో. కంటెంట్ తోపు అనుకుంటే సరిపోదు, ఆ తోపు కంటెంట్ జనాల మెదళ్లలోకి ఎక్కించాలన్న సోయ కూడా ఉండాలి.
ఏప్రిల్ నెలలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, కనీసం ఓ చిన్న ప్రెస్ నోట్ కూడా విడుదల చేయకుండా ‘తుడరుమ్’ (Thudarum) చిత్రాన్ని తెలుగులో వదిలారు. ఈ సినిమా రిలీజైందని ఎంతమందికి తెలుసో ఆ దేవుడికే తెలియాలి. కనీసం పేరున్న వెబ్సైట్లలో రివ్యూల జాడ కూడా లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి, ‘అయ్యా ఇదిగో మా సినిమా’ అని చెప్పుకునే తీరిక కూడా లేకపోయింది మన దర్శకనిర్మాతలకు.
దీనికి ముందు వచ్చిన మోహన్ లాల్ ‘ఎంపురాన్’ (L2 Empuraan), ‘బరోజ్’ (Barroz) చిత్రాల కోసం హైదరాబాద్ వచ్చి మరీ ప్రచారం చేస్తే, ఈ సినిమా విషయంలో మాత్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారో అర్థం కాని పరిస్థితి. థియేటర్లలో ఈ సినిమా చుట్టూ ఎలాంటి చిన్నపాటి సందడి కూడా క్రియేట్ కాలేదు.నిజానికి ఇది థియేటర్లలో ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేసే సత్తా ఉన్న సినిమా. మాతృక మలయాళంలో ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది.
తెలుగులోనూ సరైన పబ్లిసిటీ ఇచ్చి ఉంటే, ఇక్కడ కూడా భారీ విజయాన్నే అందుకునేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది పరిస్థితి. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుండటంతో, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీని సత్తా. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, ‘అరె, ఇంత మంచి సినిమాను థియేటర్లలో ఎందుకు మిస్ అయ్యాం’ అంటూ తలలు పట్టుకుంటున్నారు.