గ్లోబల్ వేదికపై భారతీయ నటీమణుల ప్రతిష్టను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు హీరోయిన్ అలియాభట్. నటిగా అగ్రతారగా ఉన్న ఆలియా, ఇప్పుడు అంతర్జాతీయ సినీ ప్రపంచంలోనూ తన సత్తాను చాటుతున్నారు. లండన్లో జరగనున్న 79వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ (BAFTA) వేడుకలో ఆమె ప్రెజెంటర్గా వ్యవహరించనుండటం ఇండియన్ సినిమాకే గర్వకారణం.
ఇది కేవలం ఒక అవార్డు వేడుకలో పాల్గొనడం మాత్రమే కాదు. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన నిలబడి, విజేతలకు అవార్డులు అందించే బాధ్యతను నిర్వర్తించడం. ఇప్పటివరకు ఈ గౌరవాన్ని అందుకున్న భారతీయ నటీమణుల్లో ఒకరిగా ఆలియా పేరు చేరడం విశేషం. అంతకుముందు ఈ వేదికపై భారతదేశం నుంచి కొద్దిమంది మాత్రమే ప్రెజెంటర్లుగా మెరిశారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆలియా చేరడంతో, భారతీయ సినిమా ప్రభావం ఎంత పెరిగిందో మరోసారి రుజువైంది.
రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా ఆలియా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది అని చెప్పవచ్చు. ఆ చిత్రం సాధించిన అంతర్జాతీయ గుర్తింపు, ఆలియాకు గ్లోబల్ ఆడియన్స్ను మరింత చేరువ చేసింది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, నేచురల్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఆమెను ఈ స్థాయికి తీసుకెళ్లాయి అని చెప్పుకోవచ్చు.
లండన్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఆలియా హాలీవుడ్ స్టార్లతో కలిసి వేదిక పంచుకోనున్నారు. రెడ్ కార్పెట్పై ఆమె లుక్ ఎలా ఉండబోతోంది? ఏ కేటగిరీ అవార్డును ఆమె ప్రెజెంట్ చేయనున్నారు? అనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె చేసే ప్రతి అప్డేట్ వైరల్ అవుతుండటం చూస్తే, ఆమె గ్లోబల్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ ఘనత ఒక్క ఆలియా భట్కే కాదు, మొత్తం భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.