మంచు విష్ణు నిర్మాతగా, కథ రచయితగా వ్యవహరిస్తూనే కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియన్ సినిమా “కన్నప్ప” (Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుండగా.. ఇవాళ (జూన్ 14) కొచ్చిలో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేసారు.
అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పలుమార్లు వాయిదాపడి ఎట్టకేలకు జూన్ 27 విడుదలవుతుంది. ఇప్పటివరకు విడుదల చేసిన కంటెంట్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ విడుదలైన ట్రైలర్ మాత్రం కంటెంట్ క్వాలిటీ విషయంలో మంచి పాజిటివిటీ ఇచ్చింది. అలాగే.. కథ ఏమిటి? ఏం ఎక్స్ పెక్ట్ చేయాలి అనేది క్లియర్ అయ్యింది.
ఓ పరమ నాస్తికుడు, మహాభక్తుడిగా ఎలా మారాడు అనేది “కన్నప్ప” కథాంశం. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ కనిపించగా.. రుద్ర అనే పవర్ పాత్రలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్ అదిరింది. ఇక అడవిలోని రకరకాల తెగల వ్యక్తులుగా శరత్ కుమార్, మోహన్ లాల్ కనిపించారు. హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ మంచి గ్లామర్ యాడ్ చేసింది.
అయితే.. ఎంత రీజనల్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఉన్న కంటెంట్ అయినప్పటికీ.. “కన్నప్ప”ను ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది మాత్రం సందేహమే. “కాంతార” సినిమా ఆడడానికి కారణం ఆ సంస్కృతి గురించి చాలామందికి తెలియకపోవడం. మరి “కన్నప్ప” ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి. కన్నప్ప బడ్జెట్ 100 కోట్ల పైనే అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఇప్పటివరకు ఓటీటీ దిల్ కూడా అవ్వలేదు. ఈ సినిమా రిజల్ట్ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు విష్ణు మరియు అతని కుటుంబం.