నాన్ పాన్ ఇండియా సినిమా వసూళ్ల రికార్డులను బద్ధలు కొట్టి తనెందుకు మెగాస్టార్ అనేది మరోసారి చేసి చూపించారు చిరంజీవి. సుమారు రూ.400 కోట్ల వసూళ్లతో సంక్రాంతి విన్నర్గా నిలిచారు. చిరంజీవికి హిట్లు, బ్లాక్బస్టర్లు కొత్తేం కాదు.. అయితే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ఇచ్చిన విజయం అంతకుమించి అని చెప్పాలి. చిరంజీవి సరైన విజయం అందుకుని చాలా కాలం కావడం.. చిరు పని అయిపోయిందనే కామెంట్ల నేపథ్యంలో ఈ విజయం చాలా స్పెషల్.
సంక్రాంతికి వచ్చి ఇలాంటి విజయం అందుకున్నారనే నమ్మకమో ఏమో రాబోయే రెండేళ్లకు, కుదిరితే ఆ తర్వాత కూడా సంక్రాంతికి తన సినిమా ఉండేలా చిరంజీవి చూసుకుంటున్నారా? ఏమో ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. 2027 సంక్రాంతికి ఇప్పటికే ఓ సినిమా రెడీ చేసుకుంటున్న చిరు.. 2028 పొంగల్కి కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు అని సమాచారం. ఈ మేరకు ఓ యువ దర్శకుడికి కథకు దాదాపు ఓకే చెప్పారు అని అంటున్నారు.
2027 సంక్రాంతి బెర్తులు అప్పుడే ఫుల్ అయిపోయాయి. సీనియర్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తమ సినిమాలు దింపడానికి రెడీ అయిపోయారు. అసలు సమయానికి ఎంతమంది బరిలో ఉంటారో తర్వాత సంగతి. త్వరలో ప్రారంభం కానున్న చిరంజీవి – బాబీ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. సినిమా ఓపెనింగ్ సందర్భంగా ఈ విషయం ప్రకటిస్తారని సమాచారం. అయితే ఇక్కడ మేటర్ ఏంటంటే ఇప్పుడు 2028 పొంగల్ కోసం చిరంజీవి రెడీ అవుతున్నారట.
సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ ఇటీవల చిరంజీవికి ఓ కథ చెప్పారట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ లైన్ చిరంజీవికి నచ్చిందని, పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయమన్నారని సమాచారం. అదేంటి శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంది కదా అనుకుంటున్నారా? నాని ‘ప్యారడైజ్’ పనులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో చిరంజీవి సినిమా ఇంకా లేట్ అవుతుంది అని సమాచారం.