నెపోటిజం వల్ల లాభాలు పొందిన.. నష్టాలు, కష్టాలు ఎదుర్కొన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటూ లిస్ట్ రాస్తే ఫస్ట్ ప్లేస్లో రాయాల్సిన పేరు జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. తొలి నాళ్లలో మంచి స్పందనే ఎదుర్కొంది. లాంచింగ్ ప్యాడ్గా శ్రీదేవి కూతురు అనే పేరు ఉపయోగపడింది. అయితే అది ఆమె స్టార్ హీరోయిన్ అయ్యేంత కాదు. ఆ మాటకొస్తే ఆ గుర్తింపు జాన్వీకి కాస్త ఇబ్బందే పెట్టింది. విపరీతమైన ట్రోలింగ్ చూసింది. X సైట్లలో ఫొటోలు పెట్టి ఇబ్బందులు పెట్టేంత వరకు ఆ ఇబ్బంది కొనసాగింది.
ఇటీవల మరోసారి జాన్వీ తన తొలి రోజుల కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తన తొలి సినిమా ‘ధడక్’ హిట్ అయినప్పటికీ.. అప్పట్లో ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడినా తనకు ఇబ్బందిగానే ఉండేది అని చెప్పింది. ‘ధడక్’ సినిమా సమయంలో డిప్రెషన్కి గురయ్యాను. ఎవరైనా ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఇబ్బందిపడేదాన్ని. ఎందుకంటే ఆ సినిమా సమయంలో ప్రేక్షకులు నన్ను నటిగా స్వీకరించలేదు. దాంతో అంతా అయిపోయింది, నేను ఇక్కడ కొనసాగలేను అనిపించింది అని నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది జాన్వీ. అంతేకాదు ఆ టైమ్ నన్ను రిజక్ట్ చేస్తూ వచ్చిన మెసేజ్లను ఎక్కువగా చూశాను. దాంతో సినిమా హిట్ అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పింది.
ఇక తల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ నా జీవితంలో లభించిన గుర్తింపు అంతా మా అమ్మ నుండే వచ్చింది. మా అమ్మను ఆ విధంగా కోల్పోవడం, ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం నా జీవితంలో అతిపెద్ద గాయం. చాలా మంది తల్లిదండ్రులని కోల్పోతారు. కానీ నా పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోలేరు. నేను తల్లిపై ఆధారపడిన కూతుర్ని. సొంత నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు. నేను ఎప్పుడూ దాని కోసం బుర్ర వాడలేదు. ప్రతిదానికి అమ్మ పైనే ఆధారపడ్డాను అని చెప్పింది జాన్వీ.
అలాంటి సమయంలో అమ్మ పోవడంతో ఒక్కసారిగా నా సొంత నిర్ణయాలు నేనే తీసుకోవాలి అని అర్థమైంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నాను. నా జీవితంలోకి సంబంధం లేని వ్యక్తులను రానిచ్చాను. కానీ ఇప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాను అని చెప్పింది జాన్వీ.