దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

దేశం మీద ప్రేమ కలిగి ఉండటం ఒక వంతు అయితే ఆ ప్రేమను ప్రజలందరికీ ఉపయోగపడేలా ఏదో ఒక రూపంలో బయట పెట్టడం సామాన్య విషయం కాదు. ఇటీవల కాలంలో మన దేశ పౌరులపై జరిగిన దాడికి సమానంగా మన దేశ జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై చేసిన ఆపరేషన్ సింధూర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి గారు ఓ పాట రూపంలో తన దేశభక్తిని చూపారు. ప్రసాద్ రచించిన ఈ పాటకు రమేష్ సంగీతాన్ని అందించగా కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఉమా శంకర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు మనికంట ఎడిటింగ్ చేయగా సత్య శ్రీనివాస్ గారు సంగీత సహకారాన్ని అందించారు. లక్ష్మణ్ పూడి గారు ఈ పాటకు స్వరాన్ని జోడించి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి జెడి లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… “మిత్రుడు లక్ష్మణ్ ఆపరేషన్ సింధూర్ పై మన దేశ జవానుల గురించి పాట పాడటం, ఆ పాట లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషకరం. దేశంలోని జవాన్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ఒక పాట రూపంలో మనకు చూపించారు. దానికి వారిని అభినందిస్తున్నాను. ఆయన ఎంత కాలం కేవలం ఆరోగ్యం గురించి డైట్ చెప్తారు అనుకున్నాను కానీ ఆయన తండ్రి కమ్యూనిస్టు పార్టీలో ఉండటంవల్ల ఆయన భావజాలాలు, దేశం కోసం ఏమైనా చేయాలి అనే తపన లక్ష్మణ్ లో ఈ పాట ద్వారా కనిపించాయి. మనం ముఖ్యంగా రైతులకు, జవాన్లకు ప్రాముఖ్యత ఇస్తూ జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో వారిని గౌరవిస్తాము. గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసే సమయానికి ముల్లులు నమస్కరిస్తూ రైతులకు గౌరవం ఇస్తాయి. అదేవిధంగా రాత్రి 12 గంటలకు మన ప్రశాంతంగా పడుకోవడానికి గల కారణంమైన జవాన్లకు మరోసారి అదే గడియారంలోని ముల్లులు నమస్కరిస్తూ వారికి గౌరవం ఇస్థాయి. కొన్ని దేశాలలో కచ్చితంగా వారి జీవితంలోని రెండు సంవత్సరాలు మిలటరీలో ఉంటారు. అదే రూల్ మనదేశంలో కూడా ఉండాలని సూచిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం” అన్నారు.

జేఏసీ చైర్మన్ అంజిబాబు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడి లక్ష్మీనారాయణ గారికి, ఆలీ గారికి, ఒబెరాయ్ గారికి నా నమస్కారం. నేను గతంలో ఎంతో అనారోగ్యానికి గురయ్యాను. లక్ష్మణ్ గారు తన డైట్ ద్వారా నన్ను మళ్లీ మామూలు మనిషిని చేశారు. దేశానికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేస్తున్న జెడి గారిని, ఒబెరాయ్ గారిని నేను ఫాలో అవుతూ ఉంటాను. దేశం పై తనకున్న భక్తిని తెలిపాలా పాటను చేసి అందరి ముందుకు తీసుకువచ్చిన లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ… “మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. మంచి కంటే చెడు వేగంగా ప్రజల్లోకి వెళుతుంది. అలాంటిది లక్ష్మణ్ గారు అందరికీ ఉపయోగపడేలా ఆరోగ్యాన్ని పంచుతున్నారు. నాకు తెలిసి లక్ష్మణ్ గారు కూడా ఒకప్పుడు చాలా బరువు ఉండేవారు. కానీ ఆయన ఆ కష్టాన్ని అధిగమించి నేడు అదే మార్గంలో ఎంతో ఆరోగ్యంగా అందరికి ఉపయోగపడేలా డైట్ అందిస్తూ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. దేశంపై భక్తితో ఆయన చేసిన పాటను లాంచ్ చేయడం కోసం రావడం జరిగింది. ఈరోజు స్టేజిపై ఉన్న రియల్ హీరోలను కలవడం మరింత సంతోషాన్ని కలగజేస్తుంది. గడియారంలో కూడా రెండు చేతులు జోడించి నమస్కరించే ఒక గొప్ప విషయాన్ని నేడు మనకు తెలియజేసిన జెడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మణ్ గారిలో ఒక మంచి గాయకుడున్నాడు, నటుడు ఉన్నాడు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒబెరాయ్ గారు తెలుగులో మాట్లాడుతుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మేజర్ ఒబెరాయ్ గారు మాట్లాడుతూ… “నేను ఆపరేషన్స్ సింధూర్ గురించి మాట్లాడినప్పుడు ప్రజలు నేను మాట్లాడిన విషయాలను బాగా యాక్సెప్ట్ చేశారు. వారి అభిమానానికి నా కృతజ్ఞతలు. లక్ష్మణ్ గారు అందించిన పాట చాలా బాగుంది. అవసరమైతే దేశం కోసం మనమంతా జవాన్ల వలే ముందుకు వెళ్లాలి. ప్రపంచంలోనే మన ఆర్మీ ఎంతో బలమైనది. ఈ పాట లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలీ గారిని ఎప్పటినుండో చూస్తూ ఉన్నాను. జెడి గారి మాటలు ఎంతో ప్రేరేపించే విధంగా ఉంటాయి. అలాగే లక్ష్మణ్ గారు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు డైట్ ఇస్తున్నారు. నేటి పరిస్థితులలో ఆరోగ్యమే ఎంతో ముఖ్యం. అటువంటి లక్ష్మణ్ గారిని దేవుడే మనకోసం పంపించాడు అనుకోవాలి” అన్నారు.

ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి గారు మాట్లాడుతూ… “దేశం కోసం చిన్నప్పటినుండి ఏదో ఒకటి చేయాలి అని నాకు ఉండేది. నేడు నా వయసు 56 సంవత్సరాలు. అయినా ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి గల కారణం డైట్. మన ఆరోగ్య విధాలను మంచిగా ఉండేలా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆరోగ్యంగానే ఉంటాము. అయితే ఆరోగ్య డైట్ కంటే ముందే నాలో ఒక విప్లవ కళాకారుడు, ఒక గాయకుడు, ఒక రచయిత ఉన్నాడు. మిలటరీ మాధవపురం అనే ఊరుకు ప్రతి సంవత్సరం వెళ్లి పాటలు పడేవాళ్ళం. వాళ్లే మాకు ఇన్స్పిరేషన్. దేశం కోసం ఏమైనా చేయాలి అని అందరికీ ఒక స్ఫూర్తినివ్వలని అనే ఉద్దేశంతో ఈ పాటను చేశాను. ఈ పాటను మురళి నాయక్ కుటుంబానికి అంకితం చేస్తున్నాను. సరిహద్దులో జవాన్లు మన దేశం కోసం కాపలా కాస్తున్నట్లు దేశంలోపల నుండి నేను అందరి ఆరోగ్యం కోసం డైట్ చేపిస్తూ కాపలా కాస్తున్నాను. ఆహారం మాది, ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్” అంటూ ముగించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus