నాగార్జున 99వ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఆ సినిమా ప్రచారం సమయంలోనే నాగ్ 100వ సినిమా దాదాపు ఓకే అయిపోయింది అని చెప్పారు కూడా. జయం మోహన్ రాజా దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. అంతా ఓకే రేపో మాపో ప్రారంభం అనే రేంజిలో మాట్లాడారు. కానీ సినిమా మొదలుకాలేదు. అలా అని నాగార్జున (Nagarjuna) ఏమన్నా కెమెరా, మేకప్కి దూరంగా అయితే లేడు. కీలక పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అయితే అవి కౌంట్లోకి తీసుకోలేదు అని నాగ్ తాజా మాటల బట్టి అర్థమవుతోంది.
‘కుబేర’ సినిమా ప్రచారంలో భాగంగా నాగార్జున తాజాగా బాలీవుడ్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ తన వందో సినిమా గురించి చెప్పారు. త్వరలోనే తన వందో చిత్రం చేయబోతున్నట్లు నాగార్జున (Nagarjuna) ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. త్వరలోనే అని ఎప్పుడూ చెప్పేదేగా అనుకోవద్దు. జులైలోనే సినిమా మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు చెప్పారు. ఆయన నోటి వెంటే దర్శకుడి వివరాలు రాలేదు కానీ.. తమిళ దర్శకుడు రా.కార్తీక్ చెప్పిన కథకి నాగ్ పచ్చజెండా ఊపారని సమాచారం.
కొత్త తరానికి అవకాశాలు ఇవ్వడంలో ముందుంటారు నాగార్జున (Nagarjuna) . గతంలో చాలా సందర్భాల్లో మనం చూశాం కూడా. ఇప్పుడు ఏకంగా తన వందో సినిమాకే ఈ ప్రయోగం చేస్తున్నారాయన. కేవలం రెండే సినిమాలు చేసిన రా కార్తిక్కు తన వందో సినిమా ఇవ్వడం అంటే పెద్ద విషయమే కదా. ‘నిథమ్ ఒరు వానమ్’ / ‘ఆకాశం’ అనే సినిమా చేసి మెప్పించారు రా కార్తిక్. ఇప్పుడు ఏకంగా కింగ్ నాగ్ను హ్యాండిల్ చేయబోతున్నారు.
అంతలా నాగ్ను మెప్పించిన కథేంటో మరి చూడాలి. ఆయన గత సినిమా ఎమోషన్స్ మీద నడిచే కథ. మరిప్పుడు నాగార్జున తన వందో సినిమాను అలాంటి ఎమోషన్స్ మీద నడిపిస్తారో, లేక మాస్ యాక్షన్ మూవీ చేస్తారో చూడాలి. అన్నట్లు ఈ సినిమా అఖిల్ కూడా కనిపిస్తాడని సమాచారం.