చేసినవి, చేస్తున్నవి పెద్ద సినిమాలే అయినా వరుస పెట్టి సినిమాలు ఓకే చేయడం లేదు శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). కావాలంటే మీరే చూడండి సినిమా పరిశ్రమలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇంకా నాలుగు సినిమాలే చేసింది. ఏ హీరోయిన్ అయినా ఇలా రెండేళ్లకు ఒక సినిమా చేస్తుందా? ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్నారు. అలాంటిది ఈ రోజుల్లో ఇన్ని తక్కువ సినిమాలు అంటే ఎంత సెలక్టివ్గా సినిమాలు చేస్తోంది అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎంపికలో ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరింది అని చెబుతున్నారు.
‘కేజీయఫ్’ సినిమాలతో దేశవ్యాప్తగా మెప్పించి, అభిమానుల్ని సొంతం చేసుకుంది శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). రీసెంట్గా ‘హిట్ 3’ సినిమాతో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి సత్తా చాటింది. అంతకుముందే ‘కోబ్రా’ అనే సినిమాతో తమిళ సీమలోనూ నటించింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు రెండో సినిమాకు పచ్చ జెండా ఊపింది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే
తమిళ అగ్ర హీరో అజిత్తో నటించబోతోంది అని సమాచారం.
తనకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లాంటి హిట్ బొమ్మ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్తో అజిత్ మరోసారి కలసి పని చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబరులో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. అజిత్ శైలికి తగ్గట్లుగా ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను సిద్ధం చేయనున్నారట. అలాగే హీరోయిన్ పాత్రకు కూడా వెయిట్ ఎక్కువగానే ఉంటుంది అని చెబుతున్నారు.
అందుకే అజిత్ సినిమాకు శ్రీనిధి ఓకే చెప్పింది అని అంటున్నారు. ఇక శ్రీనిధి ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ జోడీగా ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నారు. పదో నెల 17వ తేదీన సినిమాను తీసుకొస్తామని ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు.