రియల్ స్టార్ శ్రీహరి విలన్ గా అలరారుతున్న తరుణంలో, అతడ్ని నమ్మి హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాత కే.మహేంద్ర. 1999లో “పోలీస్” అనే సినిమాతో శ్రీహరిని హీరోగా ఇండస్ట్రీకి రీఇంట్రడ్యూస్ చేశారు కే.మహేంద్ర. దోసపాడు గ్రామానికి చెందిన మహేంద్ర దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది, అనంతరం నిర్మాతగా మారారు. 1977లో ‘ప్రేమించి పెళ్ళి చేసుకో’ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మహేంద్ర.. ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురలేని మొనగాడు’, ‘ఢాకూరాణి’, ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్మ్యం’ తదితర చిత్రాలు నిర్మించారు.
కాజల్ అగర్వాల్ ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన “లక్ష్మీ కళ్యాణం” చిత్రాన్ని నిర్మించింది కూడా మహేంద్ర కావడం గమనార్హం. శ్రీహరితో దాదాపు 5 సినిమాలను నిర్మించారు మహేంద్ర, ఆయన కుమార్తెను నటుడు మాదాల రవి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితమే ఆయన కుమారుడు జీతూ మరణించగా.. అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ఇవాళ (జూన్ 12) 12.00 గంటల సమయంలో ఆయన గుంటూరులో అనారోగ్యంతోనే తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు గుంటూరులోనే జరుగుతాయి.
ప్రస్తుత తరం ప్రేక్షకులకు నిర్మాతగా మహేంద్ర ప్రస్థానం అనేది తెలియకపోయినా.. శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన నిర్మాతగా మాత్రం ఆయన ఇండస్ట్రీ వర్గాలకు గుర్తుండిపోయారు. ఆయన మరణానికి సీనియర్ నిర్మాతలు నివాళులు పలికారు. మహేంద్ర అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ఎవరు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించకపోవడం గమనార్హం.