‘ఇరుముడి’ సినిమాతో ఏళ్ల తరబడి ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానుల్లో ఉన్న ‘హిట్ ఆకలి’ని తీర్చేశాడు రవితేజ. ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లపాటు కడుపు నిండిపోయేంత పెద్ద హిట్ ఇచ్చాడు. దీంతో రవితేజ తర్వాత చేయబోయే సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది. నిజానికి ఇటీవల రవితేజ కొత్త సినిమాను ప్రకటించారు కూడా. వచ్చే సంక్రాంతికి వస్తాం అని కూడా చెప్పకనే చెప్పేశారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ గుసగుసల ప్రకారం చూస్తే.. వేరే సినిమా చిత్రీకరణ మొదలైంది.
అవును, మీరు చదివింది నిజమే. రవితేజ కొత్త సినిమా ఓకే అయిపోయింది.. షూటింగ్ కూడా మొదలైంది. అదే ఎన్నో రోజులుగా చర్చలో ఉన్న వివేక్ ఆత్రేయ సినిమా. ‘సరిపోదా శనివారం’ అంటూ తనలోని యాక్షన్ టచ్ను కూడా చూపించి ప్రేక్షకుల్ని మెప్పించిన వివేక్ ఆత్రేయ.. కొన్ని నెలల క్రితం రవితేజకు ఓ కథ చెప్పారు. అంతా ఓకే అనుకుని సినిమాను స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారు. కానీ ఆ టైమ్లో నిర్మాతలు ఈ సినిమా నుండి తప్పుకున్నారు.
ఆ తర్వాత వేరే నిర్మాతలు లైన్లోకి వచ్చి సినిమాను లైవ్గా ఉంచారు. అయితే దిల్ రాజు నిర్మాణంలో హసిత్ గోలీ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది అంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. ‘ఇరుముడి’ సినిమా విజయం తర్వాత దిల్ రాజు, హసిత్ గోలీ వెళ్లి రవితేజను కలవడంతో ఈ సినిమానే ముందుకు అని అర్థమైంది. అందులోనూ ఈ సినిమా వచ్చే సంక్రాంతి బరిలో ఉంటుంది అని కూడా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే వివేక్ ఆత్రేయ సినిమా మొదలైంది అనే చర్చ జరుగుతోంది.
దీంతో ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏ సినిమా పూర్తవుతుంది. ఏ సినిమా ముందొస్తుంది అనే చర్చ జరుగుతోంది. రవితేజ టీమ్ ఏమన్నా స్పష్టత ఇస్తుందేమో చూడాలి.