తెలుగు తెరపైకి తెనాలి సోయగం

  • September 5, 2016 / 08:03 AM IST

ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఓ సామెత. ఎటు గాలి వీస్తే అటు వాలిపోవడం ప్రస్తుత పోకడ. ఈ రీతినే ‘రమణ్ రాఘవ్ 2.0’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఆంధ్రా అమ్మడు శోభిత ధూళిపాళ. తెనాలిలో పుట్టి విశాఖ, ముంబైలో పెరిగిన శోభిత 2013లో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. అనంతరం అనురాగ్ కశ్యప్ దర్శకుడిగా రూపొందిన ‘రమణ్ రాఘవ్ 2.0’తో ఆకట్టుకున్న శోభిత తెలుగులోనూ తన సత్తా చాటనున్నట్టు సమాచారం.

ఆరంభంలో దర్శకుడిగా విఫలమైన అడవి శేష్ ఈ ఏడాది విడుదలైన క్షణం సినిమాతో కథకుడిగా, నటుడిగా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న విషయం విదితమే. ప్రస్తుతం శేష్ ప్రధాన పాత్రలో ‘గూడాచారి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. రాహుల్ పాకాల, శశికిరణ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో శోభిత ఎంపికైందిట. పంపిణీ రంగం నుండి నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. శోభిత విజయంలో ‘గూడాచారి’ ఎంతవరకు సాయపడతాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus