ఏది ఏమైనా ఒంటి రంగు ముఖ్యం బిగిలూ.. ఏంటీ బాడీ షేమింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఈ మాట మేం అనడం లేదు. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి చెబుతున్నా. ప్రస్తుతమే కాదు.. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. హీరోల్లో, హీరోయిన్లలో కాస్త తెలుపు తక్కువ ఉన్నవాళ్లు ఏదో సందర్భంలో ఈ మాట చెప్పారు. అంతెందుకు రజనీకాంత్లాంటివారే చాలాసార్లు చెప్పారు. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవం గురించి కూడా చెప్పారు. తలైవాతో పోల్చడం లేదు కానీ ఇటీవల సుహాస్ కూడా ఇదే చెప్పారు.
దీంతో సుహాస్ను అంత మాట అన్నది ఎవరు? అంతలా అవమానించింది ఎవరు అనే చర్చ పెద్ద ఎత్తున టాలీవుడ్లో జరుగుతోంది. ఆయన ఆ సినిమా ఏంటి, హీరోయిన్/ హీరో ఎవరు అనే వివరాలు చెప్పలేదు కానీ.. ఆయన ఆ తర్వాత చెప్పిన పోలికలు, చూపించిన ఆనందం చూస్తే ఆ హీరోయిన్ కీర్తి సురేశ్ అని అర్థమవుతోంది. కానీ ఈ మాట ఆయన ఎక్కడా డైరెక్ట్గా చెప్పలేదు. ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నానో , అక్కడే విజయం సాధించా అనడంతో ఆమె పేరు చర్చలోకి వచ్చింది.
ఓటీటీ, యూట్యూబ్లో చేస్తూ ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చాడు సుహాస్. తర్వాత హీరోగా మారి ‘కలర్ ఫొటో’ అనే సినిమాతో మెప్పించాడు. అప్పట్నుండి లీడ్ రోల్స్లో సినిమాలు చేస్తున్నాడు. అప్పుడప్పుడూ క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్లో, స్పెషల్ రోల్స్లో కూడా మెరుస్తున్నాడు. ఈ కెరీర్ ఆరంభంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయని చెబుతూ.. తానూ అందుకు మినహాయింపు కాదంటూ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి వివరించాడు.
ఓ సినిమాలో హీరోయిన్కు క్లోజ్గా ఉండే క్యారెక్టర్ కోసం సుహాస్ని తొలుత పిలిచారట. ఆ పాత్ర కోసం సెట్కి వెళ్తే ‘ఇతన్ని ఎందుకు పిలిచారు’ అంటూ అక్కడున్న ఓ వ్యక్తి తన ముందే అన్నాడట. అప్పుడు బాధ పడ్డానన్న సుహాస్.. కొన్నేళ్ల తర్వాత కీర్తి సురేష్తో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా చేశానని, అదే తన విజయం అని చెప్పాడు. మరి సుహాస్ చెప్పిన సినిమా, ఆ వ్యక్తి ఎవరబ్బా?