పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ మీద ఆ మధ్య భారత్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశానికి నీళ్లు అందకూడదని సింధు జలాలను ఆపేసింది. విదేశాల దగ్గర పాకిస్థాన్ దురాగతాలను ఎండగట్టి మన దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు. ఈ క్రమంలో దాయాది దేశం సినిమా నటుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నటులు నటించిన సినిమాల్ని బ్యాన్ చేయాలని కూడా నిర్ణయించారు. అలా పాక్ నటి నటించింది అని ‘సర్దార్జీ 3’ (Sardaar Ji 3) సినిమా మన దేశంలో విడుదల కాని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఏకంగా ఆ సినిమాలో నటించి ఇండియన్ హీరో మీద కూడా నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ‘సర్దార్జీ 3’ సినిమాను పాకిస్థాన్లో విడుదల చేయడం దేశద్రోహంతో సమానమేనని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కామెంట్ చేసింది. అంతేకాదు మన సైనికుల త్యాగాల కథాంశంతో రానున్న ‘బోర్డర్ 2’ (Border 2) సినిమాలో నటుడు దిల్జిత్ దొసాంజ్(Diljit Dosanjh) ను తొలగించాలని సినీ వర్కర్ల సంఘం డిమాండ్ చేసింది. దిల్జిత్పై జీవితకాల నిషేధం విధించాలని సినీ ఎంప్లాయ్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.
అంతేకాదు అతడిని దేశద్రోహి అని కూడా అభివర్ణించింది. దిల్జిత్ సైనికుడు కాదు.. ఆయన పాకిస్థాన్ను ఎంచుకుంటే.. చిత్ర పరిశ్రమ అతడిని తిరస్కరించాలని పేర్కొంది. ఇదంతా ఎందుకు అంటే.. దిల్జిత్ (Diljit Dosanjh)స్వీయ నిర్మాణంలో రూపొందిన ‘సర్దార్జీ 3’ సినిమాను జూన్ 27న పాకిస్థాన్లో విడుదల చేశారు. భారతీయ సైనికులు, పౌరుల రక్తపాతానికి కారణమైన ఆ దేశంలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాలో పాకిస్థాన్ నటి హనియా భాగం కావడం దారుణమైన విషయం.
ఆపరేషన్ సిందూర్ను ఆమె బహిరంగంగానే హేళన చేసింది అని గుర్తు చేసింది ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్. హనియా లాంటి వ్యక్తులకు దిల్జిత్ సహకరించడం సిగ్గుచేటు. అందుకే అతడిని బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇదే విషయంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్డబ్ల్యూఐసీఈ) కూడా ఇలానే స్పందించింది. దిల్జీత్ (Diljit Dosanjh) ను నిషేధించాలని కోరింది.