ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అన్న ఎన్టీఆర్!

  • September 20, 2017 / 11:37 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ మూవీ అభిమానులను ఊరిస్తోంది. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో తారక్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ పత్రికా ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు.”‘సినీ పరిశ్రమలో వారసత్వం పనికిరాదు. కేవలం టాలెంటే ముఖ్యం. నన్ను హీరో కావాలని నా తల్లిదండ్రులు బలవంతపెట్టలేదు. నా ఇష్టంగానే తెరపై అడుగుపెట్టా. వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నా” అని చెప్పారు.

ఇక సినీ రంగంలో పోటీ గురించి మాట్లాడుతూ ” హీరోల మధ్య పోటీ ఉన్నపుడే ఆసక్తిగా ఉంటుంది. కాకపోతే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉంటే మంచిది.” అన్నారు. ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు పెరుగుతున్నాయి.. మరి మీరు అలాంటి మూవీ ఎప్పుడు చేస్తారంటే.. “మంచి కథతో సరైన దర్శకుడు వచ్చాడంటే మల్టీస్టారర్ సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా” అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ పై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus