హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి.. ఓ స్థాయికి వచ్చాక పెద్ద హీరోల సినిమాల్లో నటించడానికి ఆ పాత్రకు ప్రాధాన్యం లేకపోయినా ఓకే చెప్పేస్తుంటారు. ఆ తర్వాత కాస్త ఫేమ్ వచ్చేసరికి ‘అలాంటి పాత్రలు నేను చేయను’ అంటారు. మరి కొంతమంది కెరీర్ చివరి దశకు వచ్చేసింది అని అనిపిస్తే ‘ఆ గుర్తింపు లేని పాత్రలు నేను చేయను’ అని అంటుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా రెండో స్టైల్లో మాట్లాడుతోంది. అను కెరీర్ దాదాపు ఆఖరి దశకు వచ్చేసింది అని చెప్పొచ్చు.
అవకాశాల కోసం ఆరాటపడే తత్వం నాది కాదు అనేది అను ఇమ్మాన్యుయేల్ లేటెస్ట్ స్టేట్మెంట్. ఇక్కడి వరకు బాగానే ఉంది కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా ఇకపై రొటీన్ కమర్షియల్ సినిమా చేయను అని తేల్చేసింది. రష్మిక మందన సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’లో అను ఓ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో స్టార్ హీరోల సినిమాల గురించి, అందులో హీరోయిన్ల పాత్రల గురించి మాట్లాడింది. పనిలో పనిగా హాలీవుడ్ సినిమాల గురించి కూడా మాట్లాడేసింది.
హాలీవుడ్ సినిమాల్లో హీరో, హీరోయిన్, విలన్ అంటూ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ కథను డ్రైవ్ చేసేలా అక్కడి పాత్రలు రాస్తారు. ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమా కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అదే చేశారు. అన్ని పాత్రలకు న్యాయం చేశారు అని మెచ్చేసుకుంది. ప్రస్తుతానికి తన సినీ ప్రయాణం అను అసంతృప్తిగా ఉందట. కానీ నటిగా సంతృప్తి ఉందట. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగచైతన్య, కార్తి, శివ కార్తికేయన్ లాంటి స్టార్స్తో కలిసి నటించడమే ఆ సంతృప్తికి కారణమని చెప్పింది.
అయితే తన కెరీర్లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోందని అను చెప్పింది. కొన్ని కమర్షియల్ సినిమాల్లో నటించడం వల్ల నటిగా సంతృప్తి లభించలేదు అని చెప్పింది. నాలుగు స్టెప్పులు వేసి.. డైలాగ్స్ చెప్పిస్తారు ఆ సినిమాల్లో. అందుకే ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదు అనుకుంటున్నాను అని తేల్చి చెప్పేసింది. అయితే ఆమె పైన చెప్పిన స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం నాలుగు స్టెప్పులు, డైలాగ్లవే. అంటే ఆమె స్టార్ హీరోల సినిమాల గురించి అన్నట్లే.