కింగ్ ఖాన్ తో ముచ్చటగా మూడోసారి!

  • April 4, 2016 / 06:03 AM IST

ముచ్చటగా మూడోసారి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సరసన అనుష్క శర్మ నటిస్తుందని ముంబై వర్గాల సమాచారం. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధమైంది. వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షారుఖ్ సిఖ్ పర్యాటకుడిగా కనిపిస్తారు. షారుఖ్ సరసన కథానాయికగా అనుష్క శర్మ పేరును పరిశీలిస్తున్నారు. దర్శకుడు ఆమెను కలసి కథ వివరించారు. షారుఖ్ ‘రబ్ నే బనాది జోడీ’తో అనుష్క శర్మ హిందీ చిత్రసీమకు కథానాయికగా పరిచయమైంది. తర్వాత అనుష్క జోరుకు హిందీలో బ్రేకులు పడలేదు. ఆ చిత్రంలో షారుఖ్ సిఖ్ గా కనిపించారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఇద్దరూ కలసి నటించిన యష్ చోప్రా ‘జబ్ తక్ హై జాన్’ కూడా మంచి విజయం సాధించింది. ముచ్చటగా మూడో చిత్రంతో హ్యాట్రిక్ నమోదు చేయాలని ఈ జోడీ భావిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ నటిస్తున్న చిత్రాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.
దర్శకుడు ఇంతియాజ్ అలీతో అనుష్క పని చేయనుండడం ఇదే మొదటిసారి. రణబీర్ కపూర్ కథానాయకుడిగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్ స్టార్’ చిత్రం కోసం కథానాయికగా మొదట అనుష్క శర్మ పేరు బలంగా వినిపించింది. చివరకు, నర్గిస్ ఫక్రి నటించింది. ఇన్నాళ్లకు అనుష్క, అలీ కలయిక కుదిరింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus