పాన్ ఇండియా సినిమా ఫీవర్ ఏ ముహూర్తాన ఇండియన్ సినిమాకు వచ్చిందో కానీ.. అప్పటి నుండి అవకాశం ఉన్నా లేకపోయినా, సత్తా ఉన్నా లేకపోయినా కొన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశారు. పులిని చూసిన నక్క వాతలు పెట్టుకున్నట్టు పాన్ ఇండియా అతుకులు అతికించి రిలీజ్ చేసి బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడ్డారు. అవన్నీ చూసి అన్నారో, లేక ఆయనకు వేరే సమాచారం ఉందో తెలియదు కానీ ప్రముఖ రచయిత బీవీఎస్ రవి పాన్ ఇండియా ఫీవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి మాట్లాడుతూ ‘ధురంధర్’ సినిమాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆ సినిమాను టాలీవుడ్లో తెరకెక్కించి ఉంటే సినిమా ఎలా వచ్చేది అనే విషయంలో కామెంట్లు చేశారు. ‘ధురంధర్’ సినిమాను టాలీవుడ్లో తెరకెక్కించి రెండింతలు ఎక్కువ ఖర్చు పెట్టించి.. ఆ సినిమా స్థాయిలో కూడా తెరకెక్కించలేకపోయేవారు అని కామెంట్ చేశారు బీవీఎస్ రవి. దీంతో ఆయన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నిజానికి బీవీఎస్ రవి చెప్పిన మాటలు వింటుంటే.. అలానే అనిపిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్లో గత కొన్నేళ్లుగా వస్తున్న సినిమాల్లో ఎలివేషన్లు, గ్రాండియర్ల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టేయడం, వాటి వల్ల సినిమా పలుచబడటం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా కథ కంటే ఈ ఎలిమెంట్లపై ఎక్కువగా దృష్టి పెట్టి మిగిలిన అంశాలు వదిలేస్తున్నారు. అందుకే భారీ అంచనాలతో వచ్చి దారుణమైన ఫలితాల్ని పొందాయి. ఇప్పటికీ టాలీవుడ్లో కొన్ని సినిమాలు అదే మోజుతో రూపొందుతున్నాయి.
టాలీవుడ్ అనే కాదు.. మొత్తం ఇండియన్ సినిమాలో ఇలాంటి పాన్ ఇండియా ఫీవర్ ఎక్కువైపోయింది. అందుకనే బీవీఎస్ రవి ఆ మాట అన్నట్లున్నారు. మరి ఆయన మాటలు కాకపోయినా, పరిస్థితులు అర్థం చేసుకొని మన దర్శకనిర్మాతలు ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.