Dil Raju: ‘సీతమ్మ వాకిట్లో..’ తో ‘శతమానం భవతి’ సీక్వెల్ కూడా రెడీ అవుతుందా?

2013 సంక్రాంతి కానుకగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా వచ్చింది. వెంకటేష్ (Venkatesh) , మహేష్ బాబు (Mahesh Babu)  హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. పుష్కర కాలం తర్వాత అంటే మార్చి 7న ఈ సినిమాను దిల్ రాజు రీ- రిలీజ్ చేయగా.. ఇప్పుడు కూడా మంచి వసూళ్లు సాధించింది. క్లాస్ సినిమాలు రీ- రిలీజ్ చేస్తే జనాలు థియేటర్లకు వస్తారన్న గ్యారంటీ ఉండదు. అలాంటిది అన్-సీజన్లో కూడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి రీ- రిలీజ్ బొమ్మని ఆడియన్స్ ఎగబడి చూశారు.

Dil Raju

కేవలం సినిమాని చూడటం అని కాదు థియేటర్స్ లో ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పాలేమో. మరోపక్క సోషల్ మీడియాలో ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చలు కూడా మొదలయ్యాయి. వెంకటేష్ కొడుకు అర్జున్, మహేష్ బాబు కొడుకు గౌతమ్..లతో ఈ సినిమా సీక్వెల్ చేయాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇంకో 5 ఏళ్ళ వరకు టైం పట్టొచ్చు. ఈ లోపు మంచి లైన్ ఉంటే.. సీక్వెల్ ప్లాన్ చేసుకోవచ్చు అని దిల్ రాజు (Dil Raju) భావిస్తున్నారు.

అందుకే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో (Srikanth Addala) మంచి ఐడియా ఉంటే చెప్పమని సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఫామ్లో లేడు. మంచి ఐడియా ఉంటే.. ముందుగా దిల్ రాజుకి (Dil Raju) చెప్పాలి. అతనికి నచ్చితే.. కొంతమంది రైటర్స్ ను అతను ప్రొవైడ్ చేయడమో లేక శ్రీకాంతే కొంతమంది అసిస్టెంట్ రైటర్స్ ను పెట్టుకుని స్క్రిప్ట్ డెవలప్ చేయడమో వంటివి చేయాల్సి ఉంటుంది.

‘సీతమ్మ వాకిట్లో..’ తో పాటు దిల్ రాజు ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) సీక్వెల్ అయిన ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారట. వాస్తవానికి గత ఏడాది ఈ సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించారు.. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. దర్శకుడు సతీష్ వేగేశ్న (Satish Vegesna) ఇప్పుడు ఈ సీక్వెల్ కథపై కుస్తీ పడుతున్నట్టు టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus