విలక్షణ దర్శకుడు, ఫీల్ గుడ్ మూవీస్ స్పెషలిస్ట్ అంటే ఖచ్చితంగా తెలుగులో వినిపించే పేరు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). కమర్షియల్ హంగుల జోలికి పోకుండా యూత్ను టార్గెట్ చేసి హిట్స్ కొట్టడంలో శేఖర్ సిద్ధహస్తుడు. డాలర్ డ్రీమ్స్తో మొదలుపెట్టి.. ఆనంద్ (Anand), గోదావరి (Godavari), హ్యాపీడేస్(Happy Days) , లీడర్ (Leader), లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (Life Is Beautiful), ఫిదా(Fidaa) , లవ్స్టోరీ (Love Story) వంటి ప్రేమకథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్లతో (Dhanush) కలిసి కుభేర (Kubera) అనే మల్టీస్టారర్ చేస్తున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్లో బిజీగా ఉన్న శేఖర్ ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) కలవడం చర్చనీయాంశమైంది. చిరంజీవిని శేఖర్ కలవడం వెనుక ఓ స్పెషాలిటీ ఉంది. దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ అపురూప క్షణాలను చిరంజీవి సమక్షంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో మెగాస్టార్ను కలిశారు శేఖర్.
వయసులో ఉన్నప్పుడు ఒకసారి చిరంజీవిని చాలా క్లోజ్గా చూసినప్పుడు ఆయనతో సినిమా చేయాలని అనుకున్నానని అలాంటిది ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ కోసం తన మనసులో మెదిలిన వ్యక్తి చిరంజీవి అని శేఖర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కలలను వెంటాడితే విజయం ఖచ్చితంగా సాధించొచ్చని కొన్ని తరాలలో స్పూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి అని శేఖర్ అన్నారు.
అందుకే పాతికేళ్ల ప్రయాణాన్ని చిరంజీవి సమక్షంలోనే జరుపుకోవాలని అనుకున్నానని చెప్పారు. తన అభిమాన నటుడిని కలిసి 25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల అనే పోస్టర్ను విడుదల చేయించి చిరంజీవి ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు ఆయన ఆ పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.