ఇప్పటి తరం పిల్లలకు రామాయణంతో పెద్దగా పరిచయం లేదేమో కానీ.. నిన్నటి తరం పిల్లల వరకు రామాయాణం అంటే తెలుసు. ఈ తరం వారికి ‘రామాయణ’ అంటే ‘ఆదిపురుష్’ సినిమా మాత్రమే. అందులో ఏం చూపించారు, ఏం వక్రీకరించారు అనే చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. ఆ విషయం పక్కన పెడితే.. రామాయణంలో ప్రధాన వ్యక్తులు ఎవరు అంటే రాముడు, సీత, హనుమంతుడు, రావణుడు.. అంటూ లిస్ట్ చెబుతారు. ఇందులో ఎక్కడైనా శూర్పణక పాత్ర ఉందా? అంటే ఉండదు అనే చెబుతారు.
అయితే, ఇప్పుడు ‘రామాయణ’ ట్రైలర్ వచ్చిన తర్వాత రాముడు, రావణుడు, సీత, శూర్పణక అంటూ పాత్రల పేర్లు చెబుతున్నారు. కొంతమంది అయితే సీత పాత్ర గురించి కాకుండా శూర్పణక పాత్ర గురించే మాట్లాడుతున్నారు. ఆ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ అంటూ ఆమెను తెగ ఎలివేట్ చేస్తున్నారు. మనకు తెలిసిన రామాయణంలో శూర్పణక పాత్ర చాలా చిన్నది. అందులోనూ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. అయితే ఒక విధంగా రామాయణం మలుపు తిరిగే పాత్ర అది. కానీ పెద్ద పాత్రేమీ కాదు.
కానీ, ఇప్పుడు ‘రామాయణ’ గురించి మాట్లాడేటప్పుడు శూర్పణక పాత్ర గురించి అంతలా మాట్లాడుతున్నారు అనేదే ప్రశ్న. రావణుడి పాత్ర గురించి మాట్లాడుతున్నారు అంటే.. ఆ పాత్ర పోషించిన యశ్ సినిమా ట్రైలర్లో కనిపించిన విధానం ఒక కారణం. కానీ గట్టగా సినిమాలో నాలుగైదు సీన్లు ఉండే రకుల్ గురించి చర్చ అంటే ఆమె పీఆర్ టీమ్ బాగా పని చేస్తోంది అని అర్థమవుతోంది. కొంతమంది అయితే సాయి పల్లవి కంటే రకుల్ బాగుంది సినిమాలో అంటూ పొగిడేస్తున్నారు.
ఈ సంగతంతా తేలాలి అంటే దీపావళి రావాల్సిందే. అప్పుడే ఈ రూ.2000 కోట్ల ‘రామాయణం’ వెండితెరపైకి వస్తుంది. అప్పుడు ఇంకెన్ని పోలికలు, ప్రశ్నలు వస్తాయో చూడాలి. అన్నట్లు ఆంజనేయుడి పాత్రను ట్రైలర్లో చూపించకపోవడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.