సినిమాలోని విషయం, సత్తాతో ప్రచారం చేసుకోకుండా.. ఏదో ఒక పాయింట్తో చర్చకు దారి తీసి, దారి తీయించి ఆ సినిమాను వార్తల్లో ఉండేలా చూసుకోవడం అనేది మనం గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో చూస్తున్నాం. అయితే ఎక్కడా సినిమా టీమ్ తనకు తానుగా ఈ పని చేసినట్లు కనిపించదు. ఇప్పుడు ఇలా అనుకొని చేశారో లేక అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ.. ‘ఇడుపు కాయితం’ సినిమా గురించి ఇలాంటి చర్చ జరిగింది. ఆ సినిమా సంగతే ఇంకా తేలలేదు అనుకుంటుంటే.. ఇంకో సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చకు దారి పడుతోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. చాలా నెలలుగా ఈ సినిమా గురించి ఊరిస్తూ ఉన్న చిత్రబృందం ఇటీవల అధికారికంగా సినిమాను ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా గురించి ఆయన రాసిన ఓ వాక్యం, పోస్టర్ మీద ఉన్న భాషనే ఇప్పుడు సమస్యకు కారణం అని చెప్పొచ్చు. సినిమా పోస్టర్లో సుబ్రహ్మణ్య స్త్రోత్రాన్ని తమిళం కాకుండా హిందీ లిపిలో రాశారు.
అంతే కాదు సుబ్రహ్మణ్యస్వామి ఉత్తరాదిన జన్మించారు అంటూ నాగవంశీ తన పోస్టులో పేర్కొనడం ఇప్పుడు చర్చకు కారణమైంది. నాగవంశీకి, చిత్ర బృందానికి చరిత్ర తెలియదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళనాట కొలువైన సుబ్రహ్మణ్యస్వామిని ఉత్తరాదిన పుట్టినట్లు ఎలా చెబుతారని వారంటున్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి శివ.. పార్వతుల తనయుడు కాబట్టి ఉత్తరాదిన పుట్టాడని కూడా చెప్పొచ్చు అనేది మరికొందరి వాదన.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు తమిళనాట నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మామూలుగానే ఇలాంటి విషయాల్లో తమిళులు పక్కాగా ఉంటారు. మరి ఇప్పుడు తమ ప్రాంతంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇలా రాస్తే, సినిమా తీస్తే ఏమవుతుందో చూడాలి.