టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఓ చర్చ జరుగుతోంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో సినిమాలను ఇకపై పర్సంటేజీ విధానంపైనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. దీంతో నిర్మాతల రియాక్ట్ అయి.. విషయాన్ని తేల్చుకుందాం అని అనుకున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో విషయం క్లియర్ అయిపోతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ లాస్ట్ వీకెండ్లో పరిస్థితి సంక్లిష్టం అయిపోయింది.
రాష్ట్రంలో ఇకపై పర్సంటేజీ విధానం పైనే సినిమాలు ఆడిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘పెద్ది’ సినిమాకు మినహాయింపు లేదని, ఆ సినిమాకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో మూడు సార్లు చర్చలు జరిగాయి. ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలోనూ రెండు నెలల్లో మా సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. కానీ, సంవత్సరం అయిపోయింది. ఇంకా ఏమీ తేల్చలేదు. నిర్మాతలు కావాలని ఇలా చేస్తున్నారనిపిస్తోందని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు.
అంతేకాదు ‘పెద్ది’ సినిమా టకెట్ రేట్లు పెంచొద్దు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎగ్జిబిటర్లకు, ఛాంబర్కు లేఖ ఇచ్చామని ఛాంబర్ సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం 120 మంది థియేటర్ యజమానులు దీనస్థితిలో ఉన్నారని.. ఎగ్జిబిటర్లకి ఆదాయం రావడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా పర్సంటేజ్ విధానమే నడుస్తుంటే, తెలంగాణలో రెంటల్ ఎందుకని మరోసారి ఆయన ప్రశ్నించారు. తమకు పర్సంటేజీ విధానం కావాల్సిందేనని స్పష్టం చేశారు.
దీంతో ఇప్పుడు నిర్మాతల కోర్టులోకి ‘పర్సంటేజీ’ బంతి వచ్చి పడింది. మరి వారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేస్తూనే ఇండస్ట్రీలో ఈ చర్చ మొదలైంది. గతంలో నిర్మాతలు చెప్పినట్లు ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని కలుస్తారేమో చూడాలి. అయితే అప్పుడు ‘హరి హర వీరమల్లు’, ఇప్పుడు ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగానే ఇలాంటివి జరుగుతున్నాయి