ప్రశ్నించడానికి నాకు బలం సరిపోవడం లేదు

  • February 7, 2018 / 12:41 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కొత్తగా ఆవిర్భవించబడిన అమరావతి ప్రభుత్వానికి ఏ రకంగానూ లాభం చేకూరకపోగా.. వెక్కిరిస్తున్నట్లుగా 450 కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల పవన్ కళ్యాణ్ నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని, ఈ విషయమై తాను ఏ విధంగా స్పందించబోతున్నాను అనే విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం కూడా సరైన విధి విధానాలతో రాష్ట్ర విభజన జరగకపోవడం. అందరికి సమాన న్యాయం కోసం పోరాడడానికి జనసేన పార్టీ పెట్టాను. వామ పక్షాల బంద్ కి, శాంతియుత ధర్నా కి జనసేన మద్దతు ఇస్తుంది. హోదా కోసం పోరాడేవారందరితో కలిసి పనిచేస్తాం, జేపీ, ఉండవల్లి లాంటివారితో కలిసి హోదా కోసం ముందుకు వెళ్తాం.

2014 ఎన్నికల ముందు మోడీ గారిని కలసి ఆయనకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం: కాబోయే ప్రధాన మంత్రి దగ్గరకు విడిపోయిన రెండు రాష్ట్రాల సమస్యలను తీసుకెళ్లే అవకాశం ఉంటుందని. నేను మోడీ గారిని కలిసినప్పుడు చెప్పింది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా విభజించలేదు కాబట్టి కాబోయే ప్రధాన మంత్రిగా మీరు రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని అడిగాను. దశాబ్దాల తరబడి జరిగిన అన్యాయాన్ని మార్చడానికి కొంత సమయం పట్టుద్ది కాబట్టి నేను NDAని ప్రశ్నించకుండా కొంత కాలం వేచి చూశాను. కానీ ఇప్పటికి బీజేపీ, టీడీపీ లు ప్రత్యేక హోదా గురించి ప్రజల్ని పదే పదే మభ్య పెట్టడం జరుగుతుంది.

నేను ప్రజల పక్షం తప్ప పార్టీల పక్షం కాదు. నేను ప్రత్యేకించి ఉండవల్లి అండ్ జేపీ గారి పేర్లు ఎందుకు చెప్పానంటే జనసేన అనేది ఒక పార్టీకి పరిమితం కాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరితో ఐన ముందుకు వెళ్లడం ఇంపార్టెంట్. నేను ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా ప్రజలను మభ్య పెట్టినట్టే నాకు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అటు బీజేపీ, ఇటు టీడీపీ ఇద్దరు మాటల గారడీ చేస్తున్నారు. పాలిటిక్స్ అంటేనే కన్స్ట్రుక్టీవ్ క్రిటిసిజం. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను నేను పట్టించుకోను. బూతులు తిట్టుకునే రాజకీయాలు నాకు రావు, నేను చెయ్యను. ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి సమాన భాగస్వామ్యం. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన వుంది , చిరంజీవి గారికి దీనితో సంబంధం లేదు. అటు బీజేపీ నిధులిచ్చాం అని చెప్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాలేదు అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు.

వీళ్ళ మీద ప్రజలకు నమ్మకం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈరోజు ఏ వనరులు లేని రాష్ట్రాన్ని టీడీపీ చేతిలో పెడితే దాన్ని అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చిన తీరు చాలా బాధాకరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభత్వాన్ని ఒంటరిగా ప్రశ్నించడానికి నాకు బలం సరిపోవట్లేదు. అందుకే ఈరోజు నేను రాష్ట్రంలోని ఇతర ప్రముఖ నాయకులను కలుపుకుని పోరాడడానికి నిర్ణయించుకున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ గారి లాంటి ముఖ్య నాయకులతో కలిసి నడవడానికి నేను సిద్ధం. ఈ ప్రపోసల్ చేయడానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. నేను 2014లో కొన్ని స్థానాల్లో పోటీ చేసి ఈరోజు శాసన సభలో, లోక్ సభలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా లేననే బాధ అయితే ఉంది” అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus