ఒకప్పుడు ‘యశ్రాజ్ స్పై యూనివర్స్’ నుండి సినిమాలు వస్తున్నాయంటే బాలీవుడ్ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వెయిట్ చేసేది. ఈ కోవలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ ఊపులో యశ్రాజ్ టీమ్ ‘స్పై’ కథలకు డోర్లు బార్లా తెరిచింది. అయితే గత మూడు సినిమాల ప్రభావం చూస్తుంటే యశ్రాజ్ స్పైలు ఇక రావడం కష్టమే అనే సమాధానం వినిపిస్తోంది.
కావాలంటే మీరే చూడండి.. ‘టైగర్ 3’ సినిమాతో మొదలైన యశ్రాజ్ స్పై యూనివర్స్ పతనం ‘వార్ 2’ సినిమాతో స్పీడ్ అందుకుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఉన్నా.. ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. వసూళ్ల సంగతి సరేసరి. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు ట్రోలింగ్. సినిమాలో సీన్ టు సీన్ని ఏకిపారేశారు నెటిజన్లు. ఆ నొప్పి నుండి కోలుకోవడమే కాదు యశ్రాజ్ స్పై యూనివర్శ్కు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తుందని నమ్మిన ‘ఆల్ఫా’ డిజాస్టర్ అయి కూర్చుంది.
సినిమాకు తొలి రోజు తొలి ఆట నుండి ఊహించని టాక్ వచ్చింది. తొలి వీకెండ్ ముగిసేసరికి సినిమాకు రూ. 57.6 కోట్లు వచ్చాయి అని టీమ్ చెబుతున్నా.. ఫలితం ఏ మాత్రం సానుకూలంగా లేదని ముంబయి మూవీ వర్గాల టాక్. వరుసగా మూడు దెబ్బలు తగిలాక మళ్లీ యశ్ రాజ్ స్పైల వైపు చూడదు అని అంటున్నారు. కానీ యశ్రాజ్ అలా వైఫల్యాలకు తగ్గే రకం కాదు. దీంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి మొదలైంది.
స్పై యూనివర్శ్ సినిమాల్లో కొత్తగా చూపించేది ఏమీ లేకపోవడం.. దర్శకులు, నటులు మారినా అదే పాత ఫార్మాట్ ఉండటంతోనే ఈ ఇబ్బందులు అనే వాదనా ఉంది. మరి యశ్ రాజ్ టీమ్ ఏం చేస్తుందో చూడాలి.