ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక మరోసారి అద్భుతంగా సాగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి విశేషంగా సేవలందించిన ప్రముఖులను స్మరించుకుంటూ “ఇన్ మెమోరియం” విభాగంలో నివాళులర్పించారు. ఆ జాబితాలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విలక్షణ నటుడు స్వర్గీయ కోట శ్రీనివాసరావు పేరు చోటు దక్కడం ప్రతి తెలుగు వాడికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు.
తెలుగు సినిమా చరిత్రలో తనకు మాత్రమే సొంతమైన, విలక్షణమైన నటనా శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోట, ప్రతినాయక పాత్రలు, హాస్య పాత్రలు, భావోద్వేగ పాత్రలు.. ఇలా ఏదైనా సరే సునాయాసంగా పోషించిన అరుదైన నటుడు. ‘ఆహా నా పెళ్లంటలో’ వినోదాత్మక నటనతో నవ్వులు పూయించారు. గాయం, శివ, అతడు, రాఖీ, లీడర్ వంటి చిత్రాల్లో వివిధ రకాల ఎమోషన్స్ ఉన్న పత్రాలు పోషించి ఆయన ఆ కథలకు బలాన్నిచ్చారు. ప్రత్యేకంగా బొమ్మరిల్లులో తండ్రి పాత్రలో ఆయన నటించిన తీరు ప్రతి సినీ అభిమాని హృదయాలను తాకింది.
దాదాపు నాలుగు దశాబ్దాలపాటు 700కు పైగా చిత్రాల్లో నటించి, తొమ్మిది నంది అవార్డులు అందుకున్న కోట శ్రీనివాసరావు, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. రాజకీయ రంగంలో కూడా సేవలందించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు.
2025లో ఆయన మరణంతో తెలుగు సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. అయితే ఆస్కార్ వేదికపై ఆయనకు లభించిన ఈ గౌరవం, ఆయన ప్రతిభకు ప్రపంచ స్థాయి గుర్తింపుగా నిలిచింది. కోట శ్రీనివాసరావు వంటి మహానటుడిని కలిగినందుకు తెలుగు ప్రేక్షకులుగా గర్వపడాల్సిందే. ఆయన చేసిన పాత్రలు, పాత్రను బట్టి ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన నటన ఎప్పటికీ సినిమాల రూపంలో మనతోనే ఉంటాయి.