మిలియన్ మార్క్ కి చేరువలో ‘మహానటి’

  • May 12, 2018 / 06:36 AM IST

అభినేత్రి సావిత్రి నటించిన సినిమాలన్నీ అపురూప దృశ్యకావ్యాలు. టాలీవుడ్ లైబ్రరీలో ఎప్పటికీ దాచుకోవాల్సిన కళాఖండాలు అవి. మరి ఆమె జీవితంపై తీసిన సినిమా మహానటి కూడా ఆ జాబితాలోనే చేరిపోయింది. నాగ్ అశ్విన్ కి సావిత్రిపై ఉన్న అభిమానం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తోంది. ఒక పెయింటింగ్ ని శ్రద్ధగా గీసినట్టు మహానటి సినిమాలోని ప్రతిసీన్ హృదయానికి హత్తుకుంటోంది. సావిత్రి కీర్తి సురేష్ లో ఆవహించిందేమో అన్న రీతిలో ఆమె నటన ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ మూవీ ఓవర్సీస్ లోను అత్యధిక కలక్షన్స్ సాధిస్తోంది.

అక్కడి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్ల ద్వారానే 303,456 డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు 900,000 డాలర్లను ఖాతాలో వేసుకుని త్వరలో మిలియన్ మార్కును చేరుకునేందుకు అతి దగ్గర్లో ఉంది. ఇక నిన్న రిలీజ్ అయిన మెహబూబా సైతం ఆకట్టుకోలేకపోవడంతో మహానటి తిరుగులేకుండా పోయింది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈరోజు, రేపు మరిన్ని షోలను వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లెక్కన సులువుగా రెండు మిలియన్ డాలర్ మార్క్ ని మహానటి చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్లను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus