ప్రభాస్తో సినిమాలో నటిస్తే.. ఆయన ఎక్కువ ఫుడ్ పెట్టి, వద్దు బాబోయ్ అని చెప్పినా వినకుండా మొహమాటంతో కూడిన ఇబ్బంది పెడతారు అని అందరికీ తెలుసు. చాలామంది హీరోయిన్లు, హీరోలు కూడా ఈ విషయం చెప్పారు. అయితే అదంతా డార్లింగ్ ప్రేమ కారణంగా జరిగేది. అయితే తొలిసారి ఓ హీరోయిన్ సినిమా షూటింగ్ వల్ల ఇబ్బందిపడిందట. మూడు రోజుల పాటు ఆ సీన్ చేయగా.. దాదాపు నరకం చూశాను అని కామెంట్స్ చేసింది. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ నెల 9న విడుదలకానున్న ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రముఖ మలయాళ కథానాయిక మాళవిక మోహనన్ ఓ నాయికగా నటించింది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా సోలో సీన్ కోసం మూడు రోజులు ఓ పెద్ద స్విమ్మింగ్పూల్లో షూట్ చేశాం. నా మీద మొసలి దాడి చేస్తున్నట్లు నటించాల్సిన సీన్. ఆ మూడు రోజులు రోజుకు 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది అని చెప్పింది మాళవిక.
ఒకవైపు చలికి చర్మం మొద్దుబారిపోతున్నట్లు అనిపిస్తుండేది.. మరోవైపు మొసలి నాపై దాడి చేస్తున్నట్లు నటించమని డైరక్టర్ చెప్పేవారు. ఇదిలా ఉండగా ఆ స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు దారుణంగా ఉండేవి. ఆ నీళ్లలో అందరూ అందులోకి దిగి షూట్ చేసేవారు. పెయింట్స్, కెమికల్స్, వాడిపారేసిన వస్తువులు అన్నీ ఆ నీటిలోనే వేసేసేవారు. అలాంటి నీటిలో మూడు రోజులు షూటింగ్ చేశాం. అదొక వింత అనుభవం అని మాళవిక చెప్పింది.
మరి సినిమా టీమ్ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పాటు చేసింది, మాళవిక తన ఇబ్బందిని సినిమా టీమ్కి చెప్పలేదా లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సినిమా టీమ్ ఏమంటుందో చూడాలి. హీరోయిన్ల కంఫర్ట్ విషయంలో సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పటికే మచ్చలు ఉన్నాయి. ఇప్పుడు మాళవిక మాటలు ఆ మచ్చలను నిజం చేసేలా ఉన్నాయి.