విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి.. ఈ కాంబినేషన్ మీద ఇప్పుడు బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం ఆ ఇద్దరూ కలసి చేసిన ‘కింగ్డమ్’ అనే సినిమా వస్తుండటమే. ఈ నెల 31న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ని మన ఎనిమిదేళ్ల క్రితమే మిస్ అయ్యాం అని తెలుసా? అవును మీరు చదివింది నిజమే. విజయ్ – గౌతమ్ గతంలో ఓ సినిమా కోసం ప్లాన్ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల అప్పుడు సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ కాంబినేషన్ సెట్ అయింది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తొలి సినిమా ‘పెళ్ళి చూపులు’ విడుదల కాకముందు గౌతమ్ ఓ కథ చెప్పారట. కొద్ది రోజులు ఆ సినిమా గురించి చర్చలు జరిగాక.. వర్కవుట్ కాక ఆ ఆలోచన ఆపేశారట. ఆ సినిమానే సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘మళ్ళీ రావా’. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పుడు మిస్ అయిన తమ కాంబో ఇప్పుడు సెట్ అయింది అని చెప్పారు. సుమంత్ కెరీర్లో బెస్ట్ అనిపించుకున్న కొన్ని సినిమాల్లో ‘మళ్ళీ రావా’ ఒకటి.
అప్పుడు ఆ సినిమాను విజయ్ చేసి ఉంటే.. ఇప్పుడు కచ్చితంగా మంచి ఇమేజే సంపాదించుకునేవాడు. అయితే అది ఇప్పుడు విజయ్కి ఉన్న ఇమేజ్ కాదు. ఈ సమయంలోనే ఓ మాట అనిపిస్తుంది. ఎవరికి దక్కాల్సిన సినిమా వాళ్లకు దక్కుతుంది అని. ఇక ‘కింగ్డమ్’ సినిమా విషయానికొస్తే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా షూటింగ్ గురించి విజయ్ మాట్లాడుతూ షూటింగ్ మొదలు పెట్టిన కొత్తలో ఏ సీన్ తీసినా, ఇది వర్కవుట్ అవుతుందా? లేదా? అని కాస్త భయం ఉండేదట. 60 శాతం షూటింగ్ చేసిన తర్వాత ‘హమ్మయ్య’ అనుకున్నాడట విజయ్..